కశ్మీర్‌లో వేర్పాటువాదం… మళ్ళీ మొదలవబోతోందా?

Congress Wins In Jammu Kashmir Elections 2024

ఉత్తరాది ప్రజలకు దక్షిణాది రాష్ట్రాలపై ఏవిదంగా ఆసక్తి చూపరో, అదేవిదంగా దక్షిణాదితో సహా యావత్ దేశ ప్రజలు కూడా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్‌ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపరనేది చేదు నిజం.

ADVERTISEMENT

ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌లో దశాబ్ధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వేర్పాటువాదం, తుపాకుల మోతలు, బాంబు ప్రేలుళ్ళు తప్ప మార్పుకనబడక పోవడమే ఇందుకు ప్రధాన కారణంగా భావించవచ్చు.

కానీ నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదులను ఉక్కుపాదంతో అణచివేశారు. వారికి అండగా నిలబడుతున్న రెండు ప్రాంతీయ పార్టీలను సరైన పద్దతిలో అదుపు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఈ విచ్చలవిడితనానికి కారణమైన ఆర్టికల్ 371ని రద్దు చేశారు.

మోడీ ప్రభుత్వ నిర్ణయాలను దేశంలో ప్రతిపక్షాలు, పలువురు ప్రముఖులు, అధికశాతం మంది ప్రజలు ఆంగీకరించనప్పటికీ, జమ్మూ కశ్మీర్‌ చేజారిపోకుండా కాపాడుకోవడానికి, చాలా నిబ్బరంగా కటిన నిర్ణయాలు అమలు చేశారు. ఈ ప్రక్రియలో అనేకమంది సైనికుల బలిదానాలు కూడా ఉన్నాయి. అందువల్లే నేడు జమ్మూ కశ్మీర్‌లో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు.

అయితే జమ్మూ కశ్మీర్‌లో మళ్ళీ ఆనాటి వేర్పాటువాదం, వేర్పాటువాదుల హడావుడి మళ్ళీ మొదలవబోతోందా? అంటే తాజా ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అవుననే అనుకోవలసి ఉంటుంది.

నేడు హర్యానా, జమ్మూ కశ్మీర్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు తలక్రిందులు చేస్తూ హర్యానాలో మళ్ళీ బీజేపీ అధిక్యతలో దూసుకుపోతుండగా, జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ ఫ్రంట్, కాంగ్రెస్‌ దూసుకుపోతున్నాయి.

బీజేపీ మతతత్వాన్ని ఎవరూ హర్షించలేకపోవచ్చు. అలాగే జమ్మూ కశ్మీర్‌లో అధికారంలోకి రావాలనే బీజేపీ తాపత్రయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ జమ్మూ కశ్మీర్‌ మన దేశం చేజారిపోకుండా కాపాడుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిబద్దతని ఎవరూ సందేహించలేరు.

కానీ ఇప్పుడు వేర్పాటువాదానికి, వేర్పాటువాదులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కలిగి, భారత్‌ కంటే పాకిస్తాన్‌ పట్ల ఎక్కువ ప్రేమ, విధేయత చూపే నేషనల్ ఫ్రంట్, దానికి వంత పాడే కాంగ్రెస్ పార్టీ కలిసి జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

కనుక గత పదేళ్ళుగా జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, వందల మంది సైనికుల ప్రాణత్యాగాలు అన్నీ వృధా అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అంటే జమ్మూ కశ్మీర్‌లో మళ్ళీ వేర్పాటువాదుల గుప్పిట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉందనే భావించవచ్చు. ఈ భయాలు నిజమవుతాయా కాకుండా ప్రధాని నరేంద్రమోడీ ఏమైనా చేస్తారా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories