ఎన్నికలలో టిడిపి కూటమికి భారీ మెజార్టీ రావడంతో ఓడిపోయిన వైసీపి జోలికి వెళ్ళదనే అందరూ అనుకున్నారు. అయితే ఓడిపోయిన జగన్, వైసీపి బుద్ధి మారకపోగా టిడిపి కూటమి ప్రభుత్వంపై పదేపదే బురద జల్లుతుండటంతో ఆ పార్టీపై టిడిపి దృష్టి సారించక తప్పలేదు.
ముఖ్యంగా 5 ఏళ్ళ జగన్ పాలనలో వేధింపులకు గురైనవారు, ఆ కారణంగా ఆర్ధికంగా నష్టపోయినవారు వైసీపిలో తమ ప్రత్యర్ధులపై కటిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. అయితే తాను కూడా జగన్లాగ ప్రవర్తిస్తే తనకి, ఆయనకి, టిడిపికి వైసీపికి తేడా ఏముంటుందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
కానీ వైసీపిలో పలువురిపై కేసులు నమోదు చేయించి ‘శాస్త్రోక్తంగా’ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ ఇంతవరకు రాజకీయంగా ఎటువంటి చర్య తీసుకోలేదనే చెప్పాలి. కానీ సిఎం చంద్రబాబు నాయుడు సహనాన్ని అలుసుగా భావించి వైసీపి చెలరేగిపోతుండటంతో ఇప్పుడు రాజకీయంగా కూడా పావులు కదుపుతున్నారు.
ఒక్క దెబ్బకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపికి, తమ పదవులకి కూడా రాజీనామాలు చేసి జగన్కి షాక్ ఇచ్చారు.
ఒకవేళ వారు పదవులకు రాజీనామాలు చేయకుండా టిడిపిలో చేరితే, నైతిక విలువలు, అనర్హత వేటు వేయాలంటూ రాజకీయాలు చేసేందుకు జగన్కి అవకాశం లభించేది. కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఆయనకి ఆ అవకాశం లేకుండా వారితో పదవులకు రాజీనామాలు చేయిస్తున్నారు.
దీంతో ఏమి చేయాలో పాలుపోక మిగిలిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల చేత ‘పార్టీ మారడం లేదు’ అని ప్రకటింపజేశారు. అంతమాత్రన్న వారు మడమ తిప్పకుండా ఉంటారనుకోలేము. ఈ సంగతి అందరి కంటే జగన్మోహన్ రెడ్డికే బాగా తెలుసు. కనుక తన విదేశీ ప్రయాణాన్ని వాయిదా వేసుకొని పార్టీని చక్కబెట్టుకుంటారని అనుకుంటే, సెప్టెంబర్ 3న విమానం ఎక్కేసేందుకు బ్యాగ్ సర్దేసుకున్నారు.
పోలింగ్ ముగిసిన తర్వాత ఓటమి ఖాయమని స్పష్టమైనప్పుడు వైసీపిలో అందరూ తీవ్ర ఆందోళనతో ఉండేవారు. అటువంటి కీలక సమయంలో జగన్ వారికి అండగా నిలబడి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయకుండా, విదేశాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడూ పార్టీలో సంక్షోభం నెలకొన్నప్పుడు విమానం ఎక్కేస్తుండటం చూసి వైసీపి నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ని గుడ్డిగా నమ్ముకొని ఎలాగూ ఓడిపోయామని, కనీసం ఓడిపోయిన తర్వాత అయినా పార్టీపి జగన్ దృష్టి సారిస్తారనుకుంటే, ఓ పక్క ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నా జగన్ నిశ్చింతగా విదేశాలకు వెళ్ళిపోతుండటాన్ని వైసీపిలో చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ఆ విషయం పైకి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు.
మరోపక్క జగన్ విమానం ఎక్కేయగానే వైసీపిలో నుంచి బయటపడేందుకు మరికొంత మంది ఎదురుచూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అవి నిజమా కాదా అనేది జగన్ విమానం ఎక్కితేగానీ తేలీదు. జగన్ సెప్టెంబర్ 21న తిరిగి వచ్చేసరికి వైసీపిలో ఎంతమంది మిగిలి ఉంటారో చూడాలి.




