జగన్‌ పాలన మనకొద్దు… మరోసారి వస్తే ఇంతే సంగతులు!

CPI Ramakrishnaఏపీలో వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టేసి, నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులను లేదా ఇన్‌ఛార్జ్‌లను ఖరారు చేసేశాయి. ఇప్పుడు సీపీఐ పార్టీ కూడా ఎన్నికల కోసం ‘రాష్ట్రాన్ని రక్షించండి… దేశాన్ని కాపాడండి’ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తోంది.

సోమవారం అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో జరిగిన సీపీఐ సభలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో జగన్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి అంతా రివర్స్ గేరులో నడుస్తుండటంతో, అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిపోయిందన్నారు.

ADVERTISEMENT

జగన్‌ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయలేకపోగా, కనీసం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా జీతాలు కూడా ఇవ్వలేకపోతోందని అన్నారు. జీతాలు అందక ఉద్యోగులు, పెన్షన్లు అందక పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, పెండింగ్ బిల్లుల బకాయిలు అందక కాంట్రాక్టర్లు, విద్యుత్‌ బాదుడు, విద్యుత్‌ కోతలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారని రామకృష్ణ అన్నారు.

రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు ఏర్పాటుకాకపోవడంతో యువత ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని జిల్లాలకు ఫ్యాక్షన్ వ్యాపించిందని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ నేతల భూకబ్జాలు, దౌర్జన్యాలు, ఇసుక, మట్టి దోపిడీ యాదేచ్ఛగా కొనసాగుతున్నాయని రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. వైసీపీకి ఓట్లు వేసి గెలిపించిన దళితులు, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే యువకుడిని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి, అతని శవాన్ని డోర్ డెలివరీ చేస్తే, జగన్ ప్రభుత్వం చూసి చూడన్నట్లు వ్యవహరిస్తోందని, అదే… కోడికత్తి కేసులో దళిత యువకుడు శ్రీనివాస్‌కి బెయిల్‌ రాకుండా 5 ఏళ్ళుగా జైలులో మగ్గుతున్నాడని రామకృష్ణ ఆరోపించారు.

వైసీపీ నేతలు అక్రమంగా సంపాదించిన డబ్బుని ఎన్నికలలో పంచిపెట్టి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నించవచ్చని, ఒకవేళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ మరెన్నటికీ కోలుకోలేదని రామకృష్ణ అన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించి ఇంటికి సాగనంపాలని రామకృష్ణ ప్రజలను కోరారు.

ADVERTISEMENT
Latest Stories