గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పేరు మీద అప్పటి వైసీపీ సర్కార్ ఎప్పుడు ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ‘అమరావతి’ పేరును నిత్యం వార్తలలో ఉంచేవారు. ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తూ ప్రజలు, ప్రజల నిరసనను అణిచివేయడానికి ప్రభుత్వం నిత్యం ఏపీ రాజధానిలో ఒక అలజడి వాతావరణాన్ని సృష్టించాయి.
అయితే ఇప్పుడు ఈ పరిస్థితి తెలంగాణ రాజధాని ‘హైద్రాబాద్’ ఎదుర్కుంటుందనే చెప్పాలి. మొన్నటి దాకా హైడ్రాతో పేరుతో ఎక్కడ చూసిన హైద్రాబాద్, ఆ నగర సమీప ప్రాంతాల పేర్లు మీడియాలో పెద్ద సౌండే చేసాయి. దీనితో అసలు హైద్రాబాద్ లో ఎం జరుగుతుంది అని అందరు హైడ్రా వార్తల మీద ఆసక్తి చూపించారు. ఇప్పుడు మరో వార్తతో హైద్రాబాద్ అందరి నోళ్ళల్లో నానుతుంది.
హైద్రాబాద్ మహా నగరంలో నేటి నుంచి నవంబర్ 28 వరకు దాదాపు నెల రోజుల పాటు ఆంక్షలతో కూడిన కర్ఫ్యూ విధిస్తున్నట్టు హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. పలు సంస్థలు, వివిధ పార్టీలు హైద్రాబాద్ లో శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందనే సమాచారం రావడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.
అయితే ఈ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో హైద్రాబాద్ ప్రాంతంలో ఈ నెల రోజుల సమయంలో ఎటువంటి ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు వంటి నిరసన కార్యక్రమాలకు గాని, సభలు, సమావేశాలు వంటి కార్యక్రమాలకు గాని అధికారుల నుండి ఎటువంటి అనుమతులు ఉండవని పేర్కొన్నారు.
ఈ నిబంధనలు అమలులో ఉన్న ప్రాంతంలో ఐదుగురికి మించి ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకూడదని అలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని సీవీ ఆనంద్ ప్రకటించారు. అలాగే ఎవరైనా శాంతి యుత ధర్నాలు, నిరసనలు చేపట్టాలని భావిస్తే వారికి ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
ఇటు ప్రజలు, అటు రాజకీయ పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా అధికారులు ఇచ్చిన నింబధనలు గమనించి వ్యవహరించాలంటూ ఆనంద్ ప్రజలకు, రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేసారు.
అయితే గడిచిన పదేళ్లుగా శాంతి యుతంగా ఉన్న హైద్రాబాద్ మహా నగరానికి ఇప్పుడు కర్ఫ్యూ పెట్టే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం పాలనా రాహిత్యమా.? నాయకత్వ లోపమా.? అంటూ బిఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ సర్కార్ పై మండిపడుతున్నారు.




