ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎడాపెడా అనధికార విద్యుత్ కోతలు విధిస్తూండటంతో ప్రజలు అర్దరాత్రి రోడ్లపైకి వచ్చి ఆందోళనను చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తరపు ఎవరూ ఈ సమస్య గురించి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం లేదు.
ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడలోని బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే, వాటికీ విద్యుత్ కోతలు విధిస్తోంది వైసీపీ ప్రభుత్వం.
విద్యుత్ కొరత లేదని చెప్పేది వారే మళ్ళీ కోతలు విధించేది వారే. అధికారులు చెప్పే మాటలకు ఎక్కడా పొంతన ఉండదు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం బారీగా పెరిగిందని అందుకే విద్యుత్ కొరత ఏర్పడుతోందని చెపుతుంటారు. మరోసారి బొగ్గు కొరత కారణంగా సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరగక విద్యుత్ కొరత ఏర్పడుతోందని చెపుతారు. అయినా రెండు మూడు రోజులలోనే ఈ సమస్య తీరిపోతుందని నమ్మబలుకుతుంటారు. మరోపక్క రోజుల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. చివరికి విద్యుత్ సరఫరా చేయమని కోరుతూ ప్రజలు రోడ్లపైకి ఆందోళనలు చేయాలా?
ఏ రాష్ట్రంలోను రాత్రికి రాత్రి హటాత్తుగా విద్యుత్ వినియోగం పెరిగిపోదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకుండా కూర్చోవడం వలననే నేడు ఈ దుస్థితి నెలకొంది. విద్యుత్ వినియోగం పెరుగుతుందని ముందే తెలిసి ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో తగినంత బొగ్గు నిలువలు సిద్దంగా ఉంచుకోవాలి కదా?సాధారణంగా 17 రోజులకు సరిపడ బొగ్గు నిలువలు ఉంచుకోవలసి ఉండగా అందులో సగం కూడా లేదంటే ఏమనుకోవాలి?
రాష్ట్రంలో సోలార్, విండ్ మిల్ విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఉంటే నేడు ఇంత సమస్య ఉండేదే కాదు. వైసీపీ ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం వలననే నిమ్మకు నీరెత్తిన్నట్లు కూర్చొని సమస్య మొదలయ్యాక హడావుడి పడుతుంటుంది. అసలు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, బొగ్గు నిలువల పరిస్థితి ఏమిటి? వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.



