కేసీఆర్ రాజకీయాల నుంచి సైడ్ అయిపోయిన తర్వాత ఇక బీజేపీ-బిఆర్ఎస్ పార్టీల మద్య గేమ్స్ మొదలవుతాయని అందరూ అనుకుంటే, ఇంకా బిఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మద్యనే ఇంకా గేమ్స్ నడుస్తున్నాయి.
ఈ పోలిటికల్ గేమ్స్ లో భాగంగా మంత్రి కొండా సురేఖ, కేటీఆర్ మద్య మొదలైన కార్చిచ్చు అక్కినేని కుటుంబానికి వ్యాపించడంతో అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. దానికి ఆమె ఈరోజు కౌంటర్ (రిప్లై) పిటిషన్ దాఖలు చేశారు.
ఆ కేసు ఇంకా తేలక మునుపే కేటీఆర్ కూడా ఆమెపై పరువు నష్టం దావా వేశారు. కాంగ్రెస్-బిఆర్ఎస్ పార్టీలు గేమ్స్ ఆడుకుంటుంటే తాము చూస్తూ కూర్చుంటే ప్రజలు బీజేపీని మరిచిపోతారని అనుకున్నారో ఏమో మళ్ళీ బండి సంజయ్ యాక్టివ్ అయ్యారు.
ఆయన కూడా ఈ గేమ్స్ లో జాయిన్ అయ్యి తాజాగా గ్రూప్-1 రాజకీయాలు చేసి చూపారు. పనిలో పనిగా కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్, మాదక ద్రవ్యాల వ్యవహారాలతో సంబందం ఉందని ఓ పంచ్ డైలాగ్ కొట్టారు. అది కేటీఆర్కి బాగానే తగిలింది. వెంటనే లీగల్ నోటీస్ పంపించారు. “వారం రోజులలో క్షమాపణ చెప్పాలి లేదా పరువు నష్టం దావా వేస్తానని” దాని సారాంశం. కానీ “ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడేది లేదు. మరోసారి లీగల్ నోటీస్ అని బెదిరిస్త్ నేనే నీకు లీగల్ నోటీస్ పంపిస్తా కబడ్దార్” అని బండి సంజయ్ ఘాటుగా బదులిచ్చారు.
కనుక ప్రస్తుతం తెలంగాణలో పరువు నష్టం పోటీలు జోరుగా సాగుతున్నట్లే ఉన్నాయి. రాజకీయాలలో ఉన్నవారు విమర్శలు, ఆరోపణలు వస్తే వాటికి ధీటుగా జవాబు చెప్పాలి కానీ ఇలా పరువు నష్టం దావాలు వేసుకొంటూ పోతే వాటికి అంతెక్కడ?




