ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు తన ఇద్దరు కుమార్తెలు ఆద్యా, పొలెనా అంజన కొణిదెలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్లమార్గం ద్వారా కొండపైకి చేరుకోగా వారిరువురూ కారులో పైకి చేరుకొని గాయత్రీ నిలయంలో తండ్రిని కలిశారు.
వారు ముగ్గురూ స్వామివారి దర్శనానికి బయలుదేరే ముందు పవన్ కళ్యాణ్ స్వయంగా టీటీడీ అధికారులను డిక్లరేషన్ ఫారం కోరారు.
పవన్ కళ్యాణ్-అన్నా లేజ్నెవాల కుమార్తె పొలెనా అంజన కొణిదెల మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేశారు. తర్వాత ఆమె కూడా సంతకం చేసింది. పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొద్ది రోజుల క్రితమే మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని ప్రకటించారు. కానీ ఆయన అన్యమతస్థుడైనందున నియమ నిబంధనల ప్రకారం డిక్లరేషన్పై సంతకం చేయాల్సి ఉంటుందని టీటీడీ ముందే చెతెలియజేసింది.
అయితే అందుకు ఇష్టపడని జగన్ చివరి నిమిషంలో తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా డిక్లరేషన్ ఫారం తీసుకొని కూతురితో కలిసి దానిపై సంతకాలు చేశారు. ఇది జగన్కి సుతిమెత్తగా చెంపదెబ్బ కొట్టిన్నట్లే భావించవచ్చు.
జగన్మోహన్ రెడ్డి తాను టీటీడీ డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేస్తే క్రైస్తవుల మనోభావాలు, ఆ ఓటు బ్యాంక్ దెబ్బ తింటుందని అనుకొని సంతకం చేయడానికి పోయి ఉండవచ్చు. కానీ డిక్లరేషన్ మీద సంతకం చేయడానికి ఇష్టపడకపోవడంతో హిందువుల మనోభావాలు దెబ్బతీసిన్నట్లయింది కదా? జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేయకపోయినా తిరుమలకి వెళ్ళడం, స్వామివారిని దర్శించుకొని దణ్ణం పెట్టుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించడం వంటివాటితో క్రైస్తవుల మనోభావాలు దెబ్బ తింటాయి కదా?
గతంలో ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, అబ్దుల్ కలాం వంటి హేమాహేమీలు టీటీడీ డిక్లరేషన్ మీద సంతకం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. దాని వలన ప్రజలలో వారి గౌరవం మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆ విషయం మీడియా గొంతు చించుకొని చెప్పినా జగన్ చెవికి ఎక్కలేదు. అందువల్ల హిందువుల మనసులను గెలుచుకోగల ఓ చక్కటి అవకాశాన్ని జగన్ చేజార్చుకున్నారు.




