విజయవాడ వరద ప్రాంతాల సందర్శనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాడ ఎక్కడ కనిపించలేదని అటు సోషల్ మీడియాలో ఇటు సాక్షి ఛానెల్ లో నానాయాగీ చేసిన వైసీపీ ఇప్పుడు పత్తా లేకుండా పోయింది. పార్టీ అధినేత లండన్ పర్యటనలో భాగంగా బెంగుళూర్ ప్యాలస్ కు చేరుకున్నారు.
ఇక పార్టీ నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం పై బురద జల్లే దానిలో ఆసక్తిగా ఉంటే,మరికొందరు ఇంటి పంచాయితీలు చక్కదిద్దుకునే పనిలో బిజీగా ఉన్నారే తప్ప వరద సహాయక చర్యలలో పాలు పంచుకోలేదు సరికదా కనీసం గుక్కెడు నీళ్లు కూడా బాధితులకు అందించలేదు.
కానీ రాష్ట్రంలో ప్రభుత్వం పని చేస్తుందా.? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎం చేస్తున్నారు.? చిన్నబాబెక్కడ.? అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తూ తన పరువు తానే తగలేసుకుంటుంది వైసీపీ. అసలు విషయానికి వస్తే, వరద ప్రభావిత ప్రాంతాలలో నేను పర్యటించడం మూలంగా బాధితులకు, సహాయక చర్యలు చేపడుతున్న అధికారులకు కొత్త చిక్కులు వస్తాయనే ఉద్దేశంతోనే సమీక్షలకు పరిమితమయ్యాను అంటూ పవన్ వైసీపీ నేతలకు, బాధిత కుటుంబాలకు సంజాయిషీ ఇచ్చినప్పటికీ వైసీపీ ఇంకా అవే వరద రాజకీయాలు చేస్తూ బురదలో కూరుకుపోతుంది.
ఇటు విజయవాడతో పాటుగా అటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో కూడా వర్షాలు దంచికొట్టడంతో పిఠాపురం నియోజకవర్గాలలో ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్నారు పవన్. గొల్లప్రోలు వద్ద ఏలేరు, సుద్ద గడ్డలో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు పవన్. అక్కడ నిండా మునిగిన జగనన్న కాలనీలను సందర్శించి గత ప్రభుత్వం చేసిన దోపిడీని ప్రజలకు వివరిస్తున్నారు.
జగనన్న కాలనీలు, వైస్సార్ కాలనీలు అంటూ పేద ప్రజలకు ఇటువంటి ముంపు ప్రాంతాలలో ఇల్లు కేటాయించి వారి బతుకులతో రాజకీయం చేస్తుంది వైసీపీ. దాదాపు 33 ఎకరాల స్థలంలో 2వేల మంది లబ్దిదారులను ఉంచుకుని డ్రైనేజ్, రోడ్లు వంటి కనీస బేసిక్ అవసరాలను కూడా నిర్మించకుండా పట్టాలిచ్చి వైసీపీ చేతులు దులుపుకుందంటూ మండిపడ్డారు పవన్.
ప్రభుత్వ లెక్కలు ప్రకారం 13 లక్షల విలువ ఉండే ఈ ప్రాంతంలో మార్కెట్ రేట్ 30 లక్షలు పలుకుతుంటే గత వైసీపీ ప్రభుత్వం దీన్ని 60 లక్షలకు కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడిందని జగన్ కు లెక్కలతో బదులిచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్. పవన్ గ్రౌండ్ లోకి దిగితే తిరిగి తిరిగి అది వైసీపీ మెడకే చుట్టుకుంటుంది అని ఇప్పటికైనా వైసీపీ గ్రహిస్తే మంచిది.
అయినా పవన్ కూడా సహాయక చర్యలకు ఆటంకం వస్తుందని, క్రౌడ్ ఫుల్లింగ్ అవుతుందని క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉంటే అది పవన్ రాజకీయ ఎదుగుదలకు ఆటంకంగా మారవచ్చు. వచ్చే వాళ్ళు వస్తుంటారు, వెళ్లే వాళ్ళు వెళ్తుంటారు కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నత స్థానానికి ఎదగాలి అంటే క్షేత్ర స్థాయి పర్యటనలు తప్పనిసరి.
దీని వలన పార్టీ సానుభూతి పరులు, పవన్ మద్దతుదారులలోనే కాకుండా న్యూట్రల్ ఓటర్స్ దృష్టిని ఆకర్షించుకోవచ్చు. అలాగే ప్రత్యర్థి పార్టీల నోటికి తాళం వేయడంతో పాటు పవన్ ఇక్కడ…మరి జగనెక్కడా.? అంటూ ఎదురు దాడి చేయవచ్చు. గత 40 ఎళ్ళ నుంచి క్షేత్ర స్థాయి రాజకీయాలు చేసాడు కాబట్టే చంద్రబాబు రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అవలీలగా ఎదుర్కోగలుగుతున్నారు. అలాగే వ్యవస్థల మీద పట్టు సాధించగలిగారు.
జగన్ కు ఇది చేతకాకపోవడం వల్లనే కళ్ళ ముందు స్క్రిప్ట్ పేపర్ లేకపోతే గొంతు తెరవలేని పరిస్థితి. చివరికి అధికారం వచ్చినా పాలన చేతకాక వందల మంది సలహాదారులను నియమించుకోవాల్సిన దుస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దూరంగా పరదాలకు దగ్గర ఉన్న నేపథ్యంలో 151 నుంచి 11 కి పడ్డాడు జగన్.
కానీ పవన్ కు ప్రజలకు మంచి చెయ్యాలని అనే తపన, ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో ముందుకు తీసుకువెళ్లాలని అనే చిత్తశుద్ధి రెండు ఉన్నాయి. లేనిదల్లా పాలన మీద అనుభవం మాత్రమే. ఈ ఐదేళ్లలో పవన్ క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ శాఖల మీద సమీక్షలు జరుపుతూ పాలన మీద పట్టు సాధించుకోగలిగితే ఏదోరోజు తన అభిమానుల కోరిక, జనసేన ఆశయం రెండు నెరవేరుతాయి.




