ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. తర్వాత దానికి సంబందించిన బిల్లుని పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నించవచ్చు.
లోక్సభలో ఎన్డీయేకి ఆ బిల్లుని ఆమోదింపజేసుకోగల బలముంది. రాజ్యసభలో కూడా ఏదోవిదంగా ఆమోదింపజేసుకోగలదు. ఆ ధీమాతోనే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకి ఆమోదం తెలిపి ఉండవచ్చు.
ఈ నేపధ్యంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత జమిలి ఎన్నికలకు తాము సిద్దమేనని చెప్పడం ఆలోచింపజేస్తుంది. బహుశః ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు జమిలి ఎన్నికల గురించి ఆయనతో మాట్లాడి ఉండవచ్చు.
స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు శాసనసభ, లోక్సభ ఎన్నికల వరకు మొత్తం అన్నీ ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే జమిలి ఎన్నికలను కాంగ్రెస్, మిత్రపక్షాలు, మజ్లీస్ వంటి బీజేపీయేతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తునందున, ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యమా కాదా? అనేది మున్ముందు తెలుస్తుంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్ల రద్దు, లాక్డౌన్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి ఆర్టికల్ 371 రద్దుచేయడం వంటి సంచలన నిర్ణయాలు తీసుకొని అమలుచేశారు. కనుక జమిలి ఎన్నికల విషయంలో కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్వహించడం ఖాయమే అని భావించవచ్చు.
లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో మొదలుపెట్టి 2027లోగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కనుక 2027 నుంచి ఎప్పుడైనా జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందనుకుంటే, ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం రెండేళ్ళు ముందుగా ఎన్నికలకు సిద్దం కావలసి ఉంటుంది.
జమిలి ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పేశారు కనుక ఈ మూడేళ్ళలోనే అమరావతి, పోలవరం, విశాఖలో రైల్వే జోన్, భోగాపురం విమానాశ్రయం, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవలసి ఉంటుంది. సిఎం చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలకు అంగీకరించినందున ఈ పనులన్నీ పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందించక తప్పదు.
జమిలి ఎన్నికలపై వైసీపి తన వైఖరిని ప్రకటించలేదు కానీ ఈ ప్రతిపాదన వలన రెండేళ్ళు ముందుగా ఏపీలో శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరుగుతాయని నమ్మకం కలిగితే తప్పకుండా సమర్ధిస్తారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో సహ దేశంలో ఇతర రాష్ట్రాలలో ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలు కూడా బహుశః ఇదే కారణంగా జమిలి ఎన్నికలకు అంగీకరించవచ్చు. కనుక జమిలి ఎన్నికలు జరుగడం ఖాయమనే భావించవచ్చు. కానీ ఎప్పుడు ఏవిదంగా అనేది తెలియాల్సి ఉంది.




