జగన్, వైసీపిలను విమర్శిస్తున్నందుకు మీడియాపై ఎల్లో ముద్ర వేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ మీడియాలో జగన్ గురించి చెప్పిన విషయాలన్నీ నిజమే అని ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నవారే చెప్పారు. ముఖ్యంగా వైసీపీలో సజ్జల ఏవిదంగా చక్రం తిప్పేవారో తప్పక చెపుతుంటారు. వైసీపి నుంచి మళ్ళీ టిడిపిలోకి మారిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా జగన్ విచిత్ర ధోరణి నిజమేనని, ప్రతీ దాడి, తిట్లు వెనుక సజ్జల ఉన్నారని చెప్పేశారు.
ఆయన ఓ విలేఖరికి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “వైసీపిలో సీనియర్లకు జగన్ ఓ టాస్క్ ఇచ్చేవారు. ప్రతీరోజూ చంద్రబాబు నాయుడుని తిడుతుండటమే ఆ టాస్క్. పార్టీలో నా సహచరులు చాలా మంది అదే పనిలో ఉండేవారు కూడా. ఈవిషయం ప్రజలందరికీ కూడా తెలుసు.
ఓసారి నేను సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసినప్పుడు, ఆయన నా రాజకీయ అనుభవాన్ని మెచ్చుకుంటూనే, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని చెప్పారు. అదెలా అంటే చంద్రబాబు నాయుడుని, కమ్మవారిని తిట్టడం ద్వారానట! అప్పుడే జగన్కు నాపై నమ్మకం కలుగుతుందని సజ్జల చెప్పారు.
అది విని కాసేపు ఏం చెప్పాలో నాకు అర్ధం కాలేదు. ఒకవేళ నేను కూడా అలా చంద్రబాబు నాయుడుని, కమ్మవారిని తిట్టి ఉంటే నాకు పదవి లభించేది. కానీ నేను అలా వద్దనుకున్నాను. కనుక అలా చేయగలిగినవారికి పదవులు లభించాయి. అది అందరూ చూశారు కూడా.
చంద్రబాబు నాయుడుని, టిడిపి నేతలని ప్రతీరోజూ తిడుతుండటం, అవహేళన చేస్తుండటం, టిడిపి కార్యాలయాలు, నేతల ఇళ్ళపై దాడులు చేస్తుండటం, వారిని వేధిస్తుండటం ఇవన్నీ వైసీపిలో ప్రతీ ఒక్కరి డ్యూటీగా ఉండేది.
ఇవన్నీ సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పి చేయిస్తుండేవారు. టిడిపిపై పెట్టిన ప్రతీ కేసు, జరిగిన ప్రతీ దాడి వెనుక సజ్జల రామకృష్ణా రెడ్డే ఉన్నారు,” అని డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు.
ఇప్పుడు నీతులు ధర్మపన్నాలు వల్లిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వాపోతున్న జగన్, తన సొంత పార్టీలో సీనియర్ నేత చెప్పిన ఈ మాటలకు జవాబు చెప్పగలరా?




