ఏపీ లిక్కర్ స్కామ్‌పై ఈడీ విచారణ మొదలవబోతోందా?

ED Investigation On AP Liquor Scam

మద్యపాన నిషేదాన్ని దశలు వారీగా అమలు చేస్తానని జగన్‌ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మరింత మందిని తాగుబోతులుగా మార్చారు. సంపూర్ణ మద్యపాన విధానాన్ని చాలా పకాడ్బందీగా అమలుచేసి వైసీపీ నేతలు, వారి సన్నిహితులు వేలకోట్లు వెనకేసుకునేందుకు యధాశక్తిన తోడ్పడ్డారు.

జగన్‌ హయంలో జరిగిన ఈ మద్యం కుంభకోణం గురించి పార్లమెంటులో మాట్లాడిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఆ తర్వాత హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి దీనికి సంబందించిన పూర్తి వివరాలు అందించారు.

ADVERTISEMENT

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుంభకోణంపై సిట్ వేసి విచారణ మొదలు పెట్టింది. కానీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాగిన వేలకోట్ల మద్యం కుంభకోణంపై విచారణ జరిపేందుకు సిట్ పరిధి, శక్తి సామర్ధ్యాలు సరిపోవు. కనుక ఆ సామర్ధ్యం, యంత్రాంగం ఉన్న ఈడీ చేత విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరిన్నట్లు తెలుస్తోంది.

ఆయన అమిత్ షాతో భేటీ అయిన తర్వాత అమరావతికి వచ్చి సిఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అంటే ఈ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణకు హోం మంత్రి అమిత్ షా అంగీకరించి ఉండవచ్చు. కానీ ఈ విషయం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

కానీ ఒకవేళ ఈడీ రంగంలోకి దిగి విచారణ మొదలుపెడితే జగన్‌తో సహా మద్యం వ్యాపారాల చేసిన వైసీపీ నేతలందరికీ కొత్త సమస్యలు మొదలవుతాయి.

కానీ దాదాపు 15 సంవత్సరాలుగా సాగుతున్న జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణని ఈడీ పూర్తి చేయలేకపోవడంతో ఈలోగా జగన్‌ బెయిల్‌పై బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు… 5 ఏళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని పాలించారు కూడా. మళ్ళీ 2029లో ముఖ్యమంత్రి అవుతానని చాలా నమ్మకంగా చెపుతున్నారు కూడా!

కనుక అక్రమాస్తుల కేసులనే పరిష్కరించలేకపోయిన ఈడీ మద్యం కుంభకోణం కేసుని పరిష్కరించగలదా?అంటే అనుమానమే. కానీ ఈ కేసుపై ఈడీ విచారణ మొదలుపెడితే, రాజకీయంగా జగన్‌ని కట్టడి చేసి చెప్పు చేతలలో ఉంచుకునేందుకు కేంద్రం చేతికి మరో బలమైన ఆయుధంగా లభించిన్నట్లు అవుతుందని చెప్పొచ్చు.

ADVERTISEMENT
Latest Stories