తెలంగాణ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు… దేనికి సంకేతం?

Ponguleti Srinivas Reddy

తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ వంటి కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని నివాసం, హిమాయత్ సాగర్లోని ఫామ్‌హౌస్‌తో సహా ఆయన కార్యాలయాలు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్ళలో ఈడీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు.

ADVERTISEMENT

ఢిల్లీ నుంచి 16 బృందాలు వచ్చి ఏకకాలంలో 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈడీ సోదాలు శుక్రవారం సాయంత్రానికి కూడా ఇంకా కొనసాగుతున్నందున వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇదివరకు వైసీపిలో ఉండేవారు. కానీ జగన్‌ తెలంగాణలో వైసీపి దుకాణం మూసేసి ఆంధ్రాకు వెళ్ళిపోయిన తర్వాత పొంగులేటి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నపుడు వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్నారు. అయితే ఏదో విషయంలో బెడిసి కొట్టడంతో కేసీఆర్‌ ఆయనను దూరం పెట్టారు.

వేలకోట్లు ఆస్తులున్న పొంగులేటిని పార్టీలోకి ఆకర్షించడానికి కాంగ్రెస్‌, బీజేపీలు పోటీ పడ్డాయి. చివరికి ఆయన కాంగ్రెస్‌లో చేరి ఎన్నికలలో పోటీ చేసి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు.

నేటికీ ఆయనకు ఏపీలో జగన్మోహన్‌ రెడ్డితో సత్సంబంధాలున్నాయి. కనుక జగన్‌ మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చిన్నట్లయితే, పొంగులేటిపై జగన్‌ చేత ఒత్తిడి చేసి బయటకు రప్పించి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి.

ఇక మరో విషయం ఏమిటంటే, కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలకు బదులుగా బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులని బీజేపీకి అప్పగించేందుకు బీజేపీ-బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన కుదిరిందని, బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుందని చాలా వార్తలు వచ్చాయి.

కనుక పొంగులేటిని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నుంచి బయటకు రప్పించేందుకే ఈడీ చేత కేసీఆర్‌ పొగ పెట్టిస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది. హైడ్రా కూల్చివేతలతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలో నేతలందరూ హైడ్రాని సమర్ధిస్తున్నారని అనుకోలేము. కానీ సిఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయాన్ని కాదనలేక కొందరు మౌనంగా ఉండి ఉండవచ్చు. వారిలో పొంగులేటి కూడా ఒకరైనా ఆశ్చర్యం లేదు.

కనుక పొంగులేటిపై ఈవిదంగా ఒత్తిడి పెంచి కొంత మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ నుంచి బయటకు రప్పించి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూల్చివేసేందుకు తెర వెనుక ఏమైనా కుట్ర జరుగుతోందా?అనే సందేహం కలుగుతోంది. త్వరలోనే దీనికి సమాధానం లభించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories