ఆల్ టైం సూపర్ హిట్ మూవీ వంశీ – రాజేంద్రప్రసాద్ ల ‘లేడీస్ టైలర్’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన “ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్” సినిమా జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యంలో… చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ పలు ఆసక్తికర విషయాలను ఈ సినిమా కధ గురించి చెప్పుకొచ్చారు.
నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కధ ముందుగా తనికెళ్ళ భరణి గారు రవితేజ కోసం రాసినట్లుగా చెప్పారు. అయితే అప్పట్లో ఆ సినిమా కార్యరూపం దాల్చకపోవడంతో, భరణి నుండి ఆ కధను తాను కొనుగోలు చేసినట్లుగా మధుర శ్రీధర్ తెలిపారు. అయితే తర్వాత నాకు కూడా పెద్దగా నచ్చక, మరో రచయిత బివిఎస్ రవితో కధను సిద్ధం చేయించగా, ఆ కధ రాజ్ తరుణ్ కు నచ్చకపోవడంతో చేయలేదని తెలిపారు.
అయితే వంశీ గారితో ఓ సినిమా, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాలనుకున్న నేపధ్యంలో… ఈ రెండింటిని కలగలిపి, ఈ సీక్వెల్ తయారైందని తెలిపారు. అయితే ఏ పాయింట్ తో చేద్దామని అనుకున్న తరుణంలో ‘మన్మధరేఖ’ ఆలోచన తనకే వచ్చిందని, ఈ మూలకధ తనదేనని, ఈ కాన్సెప్ట్ ను వంశీ గారు డెవలప్ చేసారని అన్నారు. మరి ఇద్దరు హీరోలు చేతులు మారిన కధలో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ ఎంతమేరకు సక్సెస్ అయ్యాడో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.



