తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ గురించి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, టిడిపి నేతలు చాలా తక్కువే మాట్లాడారు. కానీ ఆ వ్యవహారం గురించి వారి కంటే వైసీపి నేతలు, వారి సొంత మీడియాయే చాలా చాలా ఎక్కువగా మాట్లాడుతుండటం విశేషం.
ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని యావత్ దేశ ప్రజలు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది. కనుక దీని వలన తమకు రాజకీయంగా చాలా నష్టం జరిగిందని, ఇంకా జరుగుతుందని వైసీపి ఆందోళన చెందుతోంది.
కనుక తాము ఆణిముత్యాలమని నిరూపించుకునేందుకు వైసీపి నేతలే ఈ వ్యవహారం గురించి ఎక్కువగా మాట్లాడడుతున్నారు. అయితే ఈ మరక శాశ్వితమని, ఇది ఏ సబ్బుతో ఉతికినా పోయేది కాదని వారు గ్రహించడానికి సమయం పడుతుంది.
అలాగని చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోలేరు కనుక టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న తిరుమల పుష్కరిణిలో స్నానం చేసి “తాను ఏ తప్పు చేయలేదని, ఒకవేళ లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసిన్నట్లయితే తాను తన వంశం నాశనం అయిపోతామని ‘సెల్ఫీ శాపం” పెట్టుకున్నారు.
ఆ శాపం ఫలిస్తుందో లేదో కానీ టీవీలలో ఆయన హడావుడి చూసినవారిలో కొందరైన “అయ్యో పాపం… ఆయన ఏ తప్పు చేసి ఉండరు. లేకుంటే అలా ప్రమాణం చేస్తారా? చేయరు… కనుక కల్తీ జరగనేలేదని ప్రజలు నమ్ముతారని ఆయన చిన్న ఆశ.
మరో మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తరపున వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతము ముందు రాష్ట్ర హైకోర్టులో కూడా ఓ పిటిషన్ వేశారు.
జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా అందరికీ ఓ బహిరంగ లేఖ వ్రాసి ట్విట్టర్ పోస్టు డబ్బాలో పడేశారు.
అయితే ఈ ప్రయత్నాలన్నీ నష్ట తీవ్రతని తగ్గించడానికి చేస్తున్నవే కానీ జరిగిన నష్టాన్ని ఎవరూ మార్చలేరు. కాలక్రమంగా ఈ వ్యవహారంపై మీడియాలో చర్చ ఆగిపోయే వరకు వైసీపికి, జగన్కి నష్టం జరుగుతూనే ఉంటుంది. కనుక అంతవరకు భరించాల్సిందే.
తిరుపతి లడ్డూ అంటే స్వీట్ షాపులలో అమ్మే మామూలు లడ్డూ మాత్రమే అనుకొని దాంతో ఆటలాడుకునందుకు జగన్ అండ్ కో మూల్యం చెల్లించక తప్పదు.
తిరుపతి లడ్డూ శ్రీవారి భక్తులకు ఒకలాగా, వైసీపి నేతలకు మరొకలాగ ఫలితం ఇస్తుండటం ఆ వెంకన్న స్వామివారి లీల కాకపోతే మారేమిటి?






