దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆ రాష్ట్రంలో అధికారం పీఠం కోసం ఆరాటపడే రాజకీయ పార్టీలు అన్ని కూడా ఉచిత పథకాల గేళం తో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
అందునా మరి ముఖ్యంగా మహిళా ఓటర్లే తమ ప్రధమ ప్రాధాన్యత అన్నట్టుగా ఉచితాల విషయంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇందులో ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని కానీ ఆ నాయకుడు ఈ నాయకుడు అని ఎటువంటి తేడా లేదు.
అందరిదీ ఒకటే మాట. పథకాల పేర్లు వేరయినా అందులో ఉండే రాజకీయ లబ్ది ఒక్కటే, ప్రజలకు అందే సంక్షేమం కూడా ఒక్కటే. ఉచితాలు పట్టు ఓటు కొట్టు అన్న నినాదంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు నడుస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ఉచిత బస్ అనేది ఒక ఎన్నికల వైరస్ లా మారి ఓటింగ్ ప్రక్రియలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ వైరస్ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణం చేస్తూ అక్కడి రాజకీయ పార్టీలకు అధికార పీఠం కట్టబెడుతుంది, అలాగే ఆ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్ రవాణా సదుపాయాన్ని అందిస్తుంది. మొదటగా కర్ణాటకలో మొదలైన ఈ వైరస్ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికార పీఠం పై కూర్చోబెట్టింది.
ఆ తరువాత తెలంగాణ వరకు వ్యాపించిన వైరస్ రేవంత్ కు ముఖ్యమంత్రి పీఠం దక్కేలా చేసింది. ఇక అటు నుంచి కూటమి రూపంలో ఏపీలో అడుగుపెట్టిన ఉచిత బస్ 164 సీట్లతో కూటమికి అఖండ విజయాన్ని అందించడంతో పాటుగా నాల్గవ సారి బాబు ని ముఖ్యమంత్రిని చేసింది.
ఇక ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తికి తమినాడు వేదిక కానుంది. త్వరలో తమినాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు గాను ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నింటికి ఈ ఉచిత బస్ పథకం ఒక దివ్యాస్త్రంలా కనిపిస్తుంది. తమిళ రాజకీయాలలోకి TVK పార్టీతో కొత్తగా అడుగుపెట్టిన విజయ్ సైతం ఈ ఉచిత బస్ పథకాన్ని నమ్ముకున్నారు.
తన ఎన్నికల మానిఫెస్టో లో భాగంగా మహిళా ఓటర్లను TVK వైపు ఆకర్షించేందుకు గాను ప్రభుత్వ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం అంటూ హామీ ఇచ్చారు. అలాగే పేదలకు ఏటా 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణి చేస్తామన్నారు. ఈ హామీ టీడీపీ సూపర్ సిక్స్ లో కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించింది.
ఇక ఏపీలో అమ్మకు వందనం మాదిరి పాఠశాల చిన్నారులకు ఏడాదికి 15 వేలు ఆర్థిక సాయం, మహిళలకు నెలకు 2500 నగదు ఇస్తామంటూ తన పార్టీ ఉచితాల లిస్ట్ చదివి వినిపించేసారు TVK అధినేత విజయ్. మొత్తానికి ఈ ఉచిత బస్ పథకం ఒక ఎన్నికల వైరస్ లా మారి అన్ని రాష్ట్రాలకు, ఆయా రాష్ట్రాలలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు సోకుతుందనే చెప్పాలి.
అయితే ఈ వైరస్ రాజకీయ పార్టీలకు ఒక అధికార పీఠం దక్కించుకునే ఆయుధంలా మారింది కానీ ఈ ఉచితాలు ఎప్పటికైనా రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత హానికరమనేది ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ గ్రహించడం లేదు.




