బిఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
డీసీసీ అధ్యక్షురాలుతో పాటుగా కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్దఎత్తున కేసీఆర్ క్యాంపు కార్యాలయంలోకి చొరబడి అక్కడున్న కేసీఆర్ ఫోటోను తీసి ఆ స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టి కేసీఆర్, బిఆర్ఎస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.
దీనితో స్పందించిన బిఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ జరిగిన ఘటనను ఖండిస్తూ ఈ దుస్సాహసానికి పాల్పడిన కాంగ్రెస్ నేతలందరి మీద చర్యలు తీసుకోవాలంటూ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ దాడి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందంటూ ఆరోపిస్తున్నారు.
రేవంత్ ఆదేశాలతోనే కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోతున్నారని, ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా హరీష్ అభివర్ణించారు. అలాగే రాష్ట్రంలో పత్తపగలే ఇలా ప్రతిపక్ష పార్టీ నేతల క్యాంప్ ఆఫీసుల మీద దాడి జరిగితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉన్నట్టా.? లేనట్టా అంటూ అధికారులను నిలదీశారు.
అయితే కాంగ్రెస్ శ్రేణుల ఇటువంటి చర్యలను పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగా రేవంత్ ఖండించాల్సి ఉంటుంది. లేదంటే నాటి జగన్ విధానాలతో నేడు వైసీపీ పరిహారం చెల్లించినట్టే రేపు కాంగ్రెస్ కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. రాజకీయాలలో విమర్శ – ప్రతివిమర్శ అనేది స్వాగతించదగ్గ పరిణామం.
కానీ దాడులు అనేది ఎవరు ఏపార్టీ మీద చేసినా అది పూర్తిగా ఖండించదగ్గ అంశం అనేది గ్రహించాలి. ప్రజలు కూడా ఇటువంటి వాటిని ఎప్పటికి ప్రోత్సహించరు అనేది ఇప్పటి వైసీపీ దుస్థితి చూస్తే యిట్టె అర్ధమవుతుంది.




