విశాఖ జిల్లాలోని ఆదానీ గ్రూప్ అధ్వర్యంలో నడుస్తున్న గంగవరం పోర్టులో వందలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. సంతోషమే. అయితే వారికి నెలకు రూ.10-12 వేలు జీతాలు మాత్రమే ఇస్తూ తమ చేత గొడ్డు చాకిరీ చేయించుకొంటోందని ఆరోపిస్తున్నారు. తమకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్పై చేస్తూ 45 రోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. పోర్టు యాజమాన్యం వారి గోడు పట్టించుకోకపోగా అందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగించడంతో సమస్య తీవ్రమైంది.
గంగవరం పోర్టులో పనిచేస్తున్నవారిలో నిర్వాసితులే ఎక్కువగా ఉన్నారు. పోర్టు నిర్మాణం జరిగితే తమకు మంచి జీతాలతో శాశ్విత ఉద్యోగాలు, సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన తమ భూములను, తమ మత్స్యకార ఉపాధిని పోగొట్టిన పోర్టు యాజమాన్యం, ఇప్పుడు ఉద్యోగాలలో నుంచి తొలగిస్తే ఎలా బ్రతకాలంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
కానీ పోర్టు యాజమాన్యం స్పంచకపోవడంతో వారి సహనం నశించి గురువారం ఉదయం గంగవరం నిర్వాసిత కుటుంబాలు, కార్మికులు వేలాదిగా తరలివచ్చి పోర్టు ముట్టడికి ప్రయత్నించారు. ఈ విషయం ముందుగానే తెలియడంతో భారీగా పోలీసులను మోహరించి, ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
వారి ఆందోళనలలో వైసీపీతో సహా టిడిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు కూడా పాల్గొని సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా పోలీసులకు, వారికీ మద్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు ఆందోళనకారుల మద్య జరిగిన ఘర్షణలలో ఇరువర్గాలలో పలువురు గాయపడ్డారు.
ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ, కార్మికశాఖ రెండూ ఉన్నాయి. కనుక ఆ శాఖల అధికారులని పంపించి పోర్టు యాజమాన్యంతో మాట్లాడి వారికి జీతాలు పెంచేందుకు ఒప్పించి ఉంటే నేడు ఇటువంటి ఘర్షణలు జరిగి ఉండేవే కావు. కానీ గంగవరం పోర్టులో 45 రోజులుగా కార్మికులు జీతాల కోసం ఆందోళన చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దానిని కాపాడుకోవచ్చును. కానీ దానిని పట్టించుకోకుండా కడపలో కొత్తగా స్టీల్ ప్లాంట్కు సిఎం జగన్ రెండోసారి శంకుస్థాపన చేశారు. అదేవిదంగా గంగవరం పోర్టులో కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వారి సమస్యలను పట్టించుకోకుండా శ్రీకాకుళం జిల్లా భావనపాడులో కొత్తగా పోర్టు నిర్మిస్తామంటూ శంకుస్థాపన చేశారు.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి అనర్గళంగా మాట్లాడే పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గంగవరం పోర్టు కార్మికుల సమస్య గురించి ఒక్క ముక్క మాట్లాడరు. పరిశ్రమల పట్ల ప్రభుత్వానికి ఆసక్తి, చిత్తశుద్ధి లేనప్పుడు, ఉన్నవి కాపాడుకోలేనప్పుడు రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఎందుకు వస్తాయి?



