తమ అభిమాన హీరోలు మాట్లాడుతుంటే చూడాలని ఏ అభిమాని మాత్రం ఉండదు. నిజమే… ఎంత ఎక్కువసేపు మాట్లాడతారా అని ఆతృతతో ఎదురుచూడడం ప్రతి అభిమాని వంతవుతుంది. కానీ, ఒక్క బాలకృష్ణ విషయంలో మాత్రం పూర్తి విరుద్ధంగా అభిమానులు మారిపోతున్నారు. బాలయ్య బాబు ఎంత తక్కువ సేపు మాట్లాడితే అంత మంచిదన్న అభిప్రాయాన్ని స్వయంగా నందమూరి అభిమానులే అంటున్నారని చెప్పడంలో సందేహం లేదు. బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయలేకపోయినా… తమ అనుయాయులు, సన్నిహితుల మధ్య ఇదే రకపు చర్చ జరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ఆడియో వేడుకలో సుదీర్ఘంగా ప్రసంగించిన నందమూరి నటసింహం బాలకృష్ణ, “అభిమానుల సహనానికి పరీక్ష పెట్టారని” చెప్పవచ్చు. ఒక్క ఫ్యాన్స్ కే కాదు, వేదికపై ఉన్న చంద్రబాబు, వెంకయ్య నాయుడు, క్రిష్ లు కూడా బాలయ్య ప్రసంగానికి నీరసించిపోయారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక అంశంతో మొదలుపెట్టిన విషయం, చివరికి ఎక్కడికి చేరుతుందో, ఎలా వెళ్తుందో తెలియని విధంగా మాట్లాడి అభిమానులు నిరుత్సాహపరిచారు. మరో విశేషమేమిటంటే… ఇదంతా సమయాభావం వలన తక్కువగా మాట్లాడుతున్నానని చెప్పడం. బహుశా మరింత సమయం ఉంటే… ఫ్యాన్స్ కు చుక్కలు చూపించేవారన్న మాట.
నిజానికి బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కరీంనగర్ లో ట్రైలర్ విడుదల చేసిన సమయంలో కూడా… ట్రైలర్ చూసిన ఆనందం కూడా ఫ్యాన్స్ కు లేకుండా చేసారని చెప్పవచ్చు. ఒకప్పుడు అనర్గళంగా మాట్లాడే బాలయ్య బాబులో ఈ రకమైన మార్పు ఎలా సంభవించిందో గానీ, భరించడం మాత్రం కష్టమేనని ఒప్పుకుని తీరాలి. ఎంత అభిమానులైనా… వారికి కాస్త సహనం, ఓర్పు ఉంటాయి. మరి వాటికే తమ అభిమాన హీరో పరీక్షలు పెడుతుంటే… తట్టుకోవడం సాధ్యమేనా…?! అందుకే… బాలయ్యా… నువ్వు మారయ్యా… అంటూ పిలుపునిస్తున్నారు.



