రాష్ట్రంలో ప్రజలు తమకు నచ్చిన రాజకీయ పార్టీకి ఓట్లు వేసుకుంటారు. వీలైతే గెలిపించుకుంటారు. గెలిస్తే అది తమకు మంచి చేస్తుందని ఆశిస్తారు. ఒకవేళ చేస్తే అదే విషయం చెప్పుకుంటారు. ఇవేవీ నేరాలు కావు. కానీ ఇవే ఓ ఇద్దరు పిల్లల తల్లి నిండు ప్రాణాలను బలిగొనడం చాలా బాధాకరమే.
తెనాలికి చెందిన స్వర్ణకారుడు గొట్టి బాలచంద్ర, గీతాంజలి (29) దంపతులకు ఇద్దరు కూతుర్లున్నారు. ఇటీవల గీతాంజలికి వైసీపి ప్రభుత్వం ఇంటి స్థలం పట్టా అందజేయడంతో ఆమె ‘తమ సొంత ఇంటి కలని జగనన్న నెరవేర్చుతున్నాడంటూ’ చాలా సంతోషం వ్యక్తం చేశారు.
అప్పటి నుంచి ఆమెని టిడిపి, జనసేనలకు చెందిన కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తుండటంతో తన భార్య వారి వేధింపులు భరించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందని బాలచంద్ర చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈలోగా వైసీపి నేతలందరూ గీతాంజలి ఇంటికి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి వెంటనే రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఒకవేళ గీతాంజలి వేధించడం, ఆ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవడం నిజమైతే అందుకు ఎవరు బాధ్యులైనా చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. కానీ హత్యాలు, ఆత్మహత్యలు, దౌర్జన్యాల గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలానే ఉన్నాయి. వాటిపై వైసీపి స్పందించే తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.
సాక్షాత్ ముఖ్యమంత్రి బాబాయ్ వివేకా హత్య చేయబడితే వైసీపి నేతలు ఏవిదంగా మాట్లాడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. వైసీపి ఎమ్మెల్సీ అనంత బాబు కాకినాడలో ఓ దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని అతి కిరాతకంగా హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే తర్వాత ఏం జరిగిందో, నేటికీ అతనితో వైసీపి నేతలు అంటకాగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మిల, మరో చెల్లి (బాబాయ్ కూతురు) సునీతా రెడ్డి ఇద్దరూ తమపై వైసీపి కాలాకేయ సైన్యం విరుచుకుపడుతోందని మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు.
గీతాంజలి ఆత్మహత్య చేసుకుంటే సిఎం జగన్ వెంటనే స్పందించి రూ.20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కానీ రాష్ట్రంలో మహిళలు, బడుగు బలహీన వర్గాల ప్రజలపై వైసీపి నేతలు దౌర్జన్యాలు చేస్తున్న వార్తలు నిత్యం మీడియాలో వస్తూన్నా ఏనాడూ స్పందించిన దాఖలాలు లేవు.
వైసీపి నేతలు ఓ పక్క ఈవిదంగా వ్యవహరిస్తూ, గీతాంజలి ఆత్మహత్య పట్ల ఇంతగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు?అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నందునే! ఇదే వేరే సమయంలో జరిగి ఉంటే, వైసీపి నేతలు బహుశః దీనిని ఓ వార్తగా చూసి ఊరుకునేవారు కదా? చాలా బాధాకరమైన గీతాంజలి ఆత్మహత్య వ్యవహారంలో టిడిపి, జనసేనలను నిందిస్తున్న వైసీపి నేతలు చేస్తున్నదేమిటి?శవరాజకీయాలే కదా?
ఒకవేళ దోషులకు శిక్ష పడాలని వైసీపి నేతలు కోరుకుంటున్నట్లయితే, ఇకనైనా శవ రాజకీయాలు చేయడం మానుకుంటే పోలీసులు విచారణ చేయగలుగుతారు కదా?




