యావత్ ప్రపంచం ‘గూగుల్’లో వెతుకుతూనే ఉంటుంది. అటువంటి గూగుల్ సంస్థ విశాఖని వెతుకుంటూ వస్తుంటే కొందరు అడ్డుపడుతుండటం చాలా దుర్మార్గమే కదా?
గత ప్రభుత్వ హయంలో విశాఖ రాజధాని అంటూ చాలా హడావుడి జరిగింది. రాజధాని ఏర్పాటు కాలేదు కానీ ఆ పేరుతో పలువురు వైసీపీ నేతలు, కొందరు ఐఏఎస్ అధికారులు కూడా విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారని, బినామీ పేర్లతో వందల ఎకరాలు కొనుగోలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. నాడు ఎన్నికలకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా కబ్జాలకు గురైన ఆ ప్రాంతాలలో పర్యటించారు కూడా.
అలాగని కూటమి ప్రభుత్వం ఆ భూములను వారి చెర నుంచి విడిపించిన దాఖాలలు కూడా లేవు. కనుక నేటికీ వారి ఆధీనంలోనే ఉన్నాయి… అని కోర్టులో దాఖలవుతున్న పిటిషన్లే చెపుతున్నాయి.
భీమిలి నియోజకవర్గంలో తర్లువాడలో గూగుల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. కనుక జిల్లా అధికారులు రైతులకు ఏకరాకు రూ.19.50 లక్షల చొప్పున చెల్లించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.
వాటిలో కొందరు ప్రముఖుల బినామీ భూములు కూడా ఉన్నాయి. కనుక ఈ భూసేకరణ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు రైతుల పేరిట జిల్లా కోర్టులో పిటిషన్లు వేయించారు. విశేషమేమిటంటే, అలా దాఖలైన పిటిషన్లలో ఇదివరకు ఎప్పుడో చనిపోయిన అప్పారావు అనే వ్యక్తి పేరిట కూడా ఓ పిటిషన్ ఉంది!
దీనిపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భూసేకరణకు అడ్డుపడుతున్నవారిని గుర్తించి అవసరమైతే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుని ఆదేశించారు.
రాష్ట్ర విభజనతో రాజధాని లేకుండా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి నిర్మిస్తానని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చెపితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో రైతులు తమ జీవనోపాధికి మూలమైన వ్యవసాయ భూములను ఇచ్చేశారు.
కానీ ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కంపెనీ భీమిలికి వస్తుంటే, అక్కడి వైసీపీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రముఖులు భూసేకరణకు అడ్డుపడుతున్నారు. రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారికి అమరావతి రైతులకున్న వివేకం, విజ్ఞత కూడా లేకపోతే ఎలా?






