ఈ 16 నెలల్లో ఏపీకి వచ్చిన సుమారు రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులన్నీ ఒక ఎత్తు అయితే నేడు ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ టెక్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకోబోయే ఒప్పందం ఒక్కటీ ఒక ఎత్తు అని చెప్పవచ్చు.
గూగుల్ కంపెనీ దక్షిణాసియాలోకెల్లా అతి పెద్ద డేటా సెంటర్ విశాఖలో నెలకొల్పేందుకు ఇదివరకే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీని కోసం నేడు ఢిల్లీలో ఒప్పందపత్రాలపై సంతకాలు జరుగబోతున్నాయి.
గూగుల్ టెక్ కంపెనీ రూ.87,000 కోట్లు పెట్టుబడితో విశాఖలో 1 గిగావాట్ సామర్ధ్యం ఉన్న డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేష్, గూగుల్ కంపెనీ ప్రతినిధులు హాజరుకాబోతున్నారు.
ఇప్పటికే ఆర్స్లర్ మిట్టల్, అదానీ వంటి కంపెనీలు ఏపీలో రూ.50-80,000 కోట్ల పెట్టుబడులతో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి కదా? మరి గూగుల్ పెట్టుబడిలో గొప్పదనం ఏమిటి? అని అనుకోవచ్చు.
రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో ఏర్పాటవుతున్న పరిశ్రమలలో యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. కనుక వాటి అభివృద్ధి ఫలాలకు కొంత పరిమితి ఉంటుంది.
కానీ పరిశ్రమల ద్వారా లభించే ఉద్యోగాలు, ఉపాధి, జరిగే అభివృద్ధి, ప్రభుత్వానికి లభించే ఆదాయం కంటే ఐటి కంపెనీల ద్వారా లభించేవి చాలా ఎక్కువగా ఉంటాయి.
గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటి కంపెనీలు రాష్ట్రానికి వస్తే, వాటిని చూసి కొన్ని వందల చిన్న పెద్దా ఐటి కంపెనీలు ఏపీకి తరలివస్తాయి.
ఉదాహరణకు హైదరాబాద్లో దశాబ్దాలుగా ఫార్మా తదితర పరిశ్రమలు కోకొల్లలున్నాయి. కానీ ఐటి కంపెనీలు వచ్చిన తర్వాతే హైదరాబాద్ అభివృద్ధి వేగం పుంజుకుంది. బెంగళూరు కూడా అంతే. ఐటి కంపెనీలు లేని హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఊహించుకుంటే ఈ తేడా అర్ధమవుతుంది.
కనుక ఏపీకి గూగుల్ వంటి ప్రఖ్యాత ఐటి కంపెనీ వస్తుండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా శుభపరిణామం. విశాఖ నగరం కూడా హైదరాబాద్, బెంగళూర్ నగరాలకు ధీటుగా ఎదగబోతోందనే తొలి సంకేతంగా భావించవచ్చు.




