వైసీపి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకే ఒక్క వీడియో రాత్రికి రాత్రి పాపులర్ అయిపోయారు. కానీ జగన్కి అది నచ్చలేదు. అందుకే టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు.
అయితే అదీ ఒక విదంగా మేలే చేసింది గోరంట్లకు. టికెట్ దక్కి ఎన్నికలలో పోటీ చేసి ఉండి ఉంటే డిపాజిట్లు కూడా దక్కేవి కావేమో? పైగా ఓడిపోయే ఎన్నికల కోసం జేబులు ఖాళీ అయిపోతాయి. పోతేపోనీ అనుకోని ధైర్యం చేసి ప్రచారానికి పోతే ఆ సూపర్ హిట్ వీడియో ప్రస్తావన రాకుండా ఉండదు. కనుక ఏవిదంగా చూసిన గోరంట్ల అదృష్టవంతుడే అనుకోవాలి.
జనాలు బహుశః ఈ పాటికి ఆ వీడియో సంగతి మరిచిపోయే ఉంటారని గోరంట్ల అనుకున్నారో ఏమో… ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్లపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుందామని అనుకుంటే చంద్రబాబు నాయుడు గూండాలను మోహరించి అడ్డుకున్నారని ఆరోపించారు. తిరుమల శ్రీవారితో రాజకీయాలు చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు నాశనం అయిపోతారని గోరంట్ల శపించారు.
చివరికి జగన్మోహన్ రెడ్డి తన కుమార్తెలను చూసి వచ్చేందుకు లండన్ బయలుదేరితే చంద్రబాబు నాయుడే ఆయనకు పాస్ పోర్ట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వందరోజుల పాలనలో వైసీపి నేతలపై కేసులు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని గోరంట్ల ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ రష్యాకు చెందిన క్రీస్టియన్ మతస్థురాలితో కాపురం చేస్తూ, సనాతన ధర్మం అంటూ మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 30,000 మంది యువతులు అదృశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ పదేపదే ఆరోపించేవారని, ఇప్పుడు ఆయనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా… ఎందుకు విచారణ జరిపించడం లేదని గోరంట్ల ప్రశ్నించారు.
ఇంతకాలం అజ్ఞాతంలో ఉండిపోయిన గోరంట్ల అకస్మాత్తుగా మీడియా ముందుకు ఎందుకు వచ్చారనే ప్రశ్నకు ముందు ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
పవన్ కళ్యాణ్ జన్మతః హిందువు… హిందువుగానే జీవిస్తున్నారు. వేరే మతస్థురాలిని వివాహం చేసుకున్నప్పటికీ ఆమె మత స్వేచ్చని గౌరవిస్తూ, తన మతానికి కట్టుబడి ఉన్నారు. కనుక ఈ విషయంలో ఆయనని ఎవరూ వేలెత్తి చూపలేరు.
జగన్ డిక్లరేషన్ చేయడానికి ఇష్టపడకనే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని అందరికీ తెలుసు. ఒకవేళ తనపై ఎవరో దాడి చేస్తారని భయపడినట్లయితే అదే విషయం డీజీపీ లేదా జిల్లా ఎస్పీకి చెపితే వారు అదనపు భద్రత కల్పించేవారు కదా? పవిత్రమైన తిరుమల లడ్డూ గురించి గోరంట్ల మాట్లాడుతుంటే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది… కదా?
ఆయన అడిగిన వాటిలో ఆంధ్రాలో అదృశ్యమైన యువతుల గురించి అడిగిన ప్రశ్న ఒక్కటే చాలా సహేతుకంగా ఉంది. పవన్ కళ్యాణ్ స్వయంగా పదేపదే ఈ ఆరోపణ చేశారు. ఇప్పుడు ఆయన చేతిలో పదవి, అధికారం ఉన్నాయి. కనుక అదృశ్యమైన ఆ అభాగ్య యువతుల ఆచూకీ కనుగొనేందుకు తగిన చర్యలు చేపడితే వారి కన్నతల్లితండ్రులు, కుటుంబాలు, ఆ అభ్యాగ్య యువతులు అందరూ చాలా సంతోషిస్తారు కదా?




