గవర్నర్‌ నిర్ణయంతో కేంద్రానికి చెడ్డపేరు… అవసరమా?

Tamil Nadu Governor faces criticism over refusing to invite Vijay to form government

టీవీకే పార్టీ అధినేత విజయ్‌ అభ్యర్ధనని తమిళనాడు గవర్నర్‌ అర్లేకర్ నేడు మరోసారి మృదువుగా తిరస్కరించి ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రమ్మనమని చెప్పి పంపించేశారు. దీంతో రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్, నటుడు విశాల్, ప్రకాష్ రాజ్, పలువురు సినీ ప్రముఖులు, చివరికి మాజీ సిఎం, డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కూడా గవర్నర్‌ తీరు తప్పు పడుతున్నారు.

వివిధ రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితే ఏర్పడినప్పుడు, ఎక్కువ సీట్లు గెలుచుకొన్న పార్టీని , గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించి, శాసనసభలో బల నిరూపణకు తగినంత గడువిచ్చారు. కానీ తమిళనాడు గవర్నర్‌ అర్లేకర్ విజయ్‌కి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు?

ADVERTISEMENT

కేంద్రం వద్దని ఆదేశించినందునేనని ప్రకాష్ రాజ్ వంటివారు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే బిజేపి మొదటి నుంచి విజయ్‌తో పొత్తుకోసం చాలా ఆరాటపడింది. కానీ అయన అంగీకరించకపోవడంతో ‘జననాయగన్’ సినిమా రిలీజ్ కానీయకుండా సెన్సార్ బోర్డు చేత తొక్కి పట్టించింది.

ఇప్పుడు కూడా విజయ్‌కి స్నేహ హస్తం అందిస్తున్న బిజేపి కాదని దాని బద్ధ విరోధి కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపడం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే విజయ్‌ తమిళనాడు సిఎం కాకుండా అడ్డుకుంటోందని ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు, విజయ్‌ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు గట్టిగా వాదిస్తున్నారు.

విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించవద్దని గవర్నర్‌ అర్లేకర్‌ని కేంద్రం ఆదేశించిందో లేదో తెలియదు. కానీ గవర్నర్‌ నిర్ణయంతో బిజేపి అధిష్టానానికి చెడ్డ పేరు వస్తోంది. తమిళనాడుపై బలవంతంగా హిందీ భాష రుద్దుతోందనే కారణంగా ప్రజలలో రాష్ట్రంలో ద్రవిడ పార్టీలలో బిజేపి పట్ల వ్యతిరేకత ఉంది.

ఎప్పటికైనా తమిళనాడులో కూడా బిజేపి అధికారంలోకి రావాలని ఆశ పడుతున్నప్పుడు ఈవిధంగా వ్యతిరేకత మూటగట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు. అయినా విజయ్‌ బొటాబొటి మెజార్టీతో 5 ఏళ్ళు నిలకడగా ప్రభుత్వం నడపడం చాలా కష్టం.

ఒకవేళ నడిపినా ఎన్నికల హామీలను అమలుచేయడం ఇంకా కష్టం. కనుక ప్రజలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ద్రవిడ పార్టీలే కాగల కార్యం చేసే అవకాశం ఉన్నప్పుడు, బిజేపి అధిష్టానం చేతికి మట్టి అంటించుకోవాల్సిన అవసరం ఏమిటి?

కనుక తక్షణం విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ని ఆదేశించడం మంచిది. లేకుంటే విజయ్‌ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఆ ఆదేశం పొందితే గవర్నర్‌కి, కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్రదిష్టే కదా?

ADVERTISEMENT
Latest Stories