రాష్ట్ర విభజన తర్వాత పాలకులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించాలి. దాని కోసమే పని చేయాలి. కూటమి ప్రభుత్వం అదే చేస్తోంది.
కానీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ప్రతీరోజూ వైసీపీ గురించే ఆలోచించాల్సి వస్తోంది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ‘2029 ఎన్నికలలో మనమే గెలవబోతున్నాం. గెలిచి అధికారంలో రాబోతున్నాం,’ అని చెప్పుకునేవారు. నేటికీ చెప్పుకుంటూనే ఉన్నారు కూడా.
కానీ ట్రాక్ మార్చి ‘రప్పారప్పా’ అంటూ లేదా కులాల మద్య చిచ్చు రగిలిస్తూ, కల్తీ నెయ్యి పేరుతో రాజకీయాలు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని గందరగోళ పరుస్తోంది.
అందువల్లే కూటమి నేతలు ఇప్పుడు పదేపదే ‘వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు,’ అని గట్టిగా చెపుతున్నారు. నేడు శాసనసభలో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఇదే మాట అన్నారు.
అంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందేమో?అనే చిన్న ఆలోచన ఇంకా పెరిగితే అది భయం లేదా అభ్రద్రతాభావంగా మారుతుంది. ఒకవేళ భయం ఏర్పడితే ఇప్పుడు వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని బల్లగుద్ది చెపుతున్నవారే రేపు ‘మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని’ ఆ తర్వాత ‘మా ప్రయత్నాలు ఫలిస్తాయనే ఆశిస్తున్నాం,” అని అంటే అధికారులు, ఉద్యోగుల పరిస్థితి ఏమిటి?
ఏది ఏమైనప్పటికీ కూటమి నేతలలో ఇలా ఆలోచించేలా చేయడంలో జగన్ సఫలం అయినట్లే ఉన్నారు.
ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే ఏమవుతుందో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో కూటమి నేతలకంటే ఎవరికీ బాగా తెలుసు?కనుక మరింత చురుకుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపాలి. మరింత తెలివిగా రాజకీయాలు చేయాలి. కులసమీకరణాలు మార్చేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలను బట్టి ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అలసత్వం, ధీమా ప్రదర్శిస్తే అందరూ రప్పా రప్పా అయిపోవడం ఖాయమే.






