తెలంగాణా ప్రభుత్వ అధికారులతో పాటు దాదాపు తెలుగు సినీ సెలబ్రిటీలంతా పాలుపంచుకున్న “హరితహారం” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొక్కలను నాటుతున్న ఈ కార్యక్రమంపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొక్కల నిర్వహణ బాధ్యతలు ఎలా ఉన్నా… ముందు నగరంలో కరువైన పచ్చదనానికి ఈ మొక్కలు ఉపశమనం కలిగిస్తున్నాయని నగరవాసులు భావిస్తున్నారు.
అయితే హైకోర్ట్ మాత్రం ఈ కార్యక్రమం పట్ల విస్మయాన్ని వ్యక్తపరిచింది. హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ లో చెట్ల నరికివేతపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు, ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై విస్మయం వ్యక్తం చేసింది. అడవులు తరిగిపోయాయంటూ “హరితహారం” పేరిట రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని చెబుతున్న ప్రభుత్వం… అభివృద్ధి పేరిట చెట్లను నరికేయడమేంటని కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నించింది.
దశాబ్దాల నాటి చెట్లు నేలకొరుగుతుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, చెట్లను నరకకుండా చేపట్టాల్సిన చర్యలపై పిటిషనర్ ను వివరణ అడిగింది. దీంతో హైకోర్ట్ నుండి కేసీఆర్ సర్కార్ కు మరో జలక్ తగిలినట్లయ్యింది. గడిచిన రెండు సంవత్సరాలకు పైగా పాలనలో అనేక సందర్భాలలో ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై హైకోర్ట్ ప్రశ్నల వర్షం గుప్పించింది.



