రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలలో ఏవైనా సమస్యలు, వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించే నిపుణులు (ట్రబుల్ షూటర్స్) కొందరు ఉంటారు. ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు. మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ ఎవరు?అంటే స్వయంగా సిఎం రేవంత్ రెడ్డే అని చెప్పక తప్పదు.
తెలంగాణ ఏర్పడగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే, కేసీఆర్ చక్రం తిప్పడంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పదేళ్ళపాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎంతగా ప్రయత్నించినా కేసీఆర్ని గద్దె దించలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి దించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కేసీఆర్ని ఫామ్హౌసుకి పరిమితం చేశారు!
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కుమ్ములాడుకుంటే రేవంత్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చిలక జోస్యం చెప్పారు. కానీ గత రెండేళ్ళుగా సీనియర్లు అందరూ రేవంత్ రెడ్డికి అండగా నిలబడి ఒక్కటిగా పోరాడుతున్నారు.
తాజాగా సింగరేణి బొగ్గు గనుల విషయంలో ఎన్టీవీ ప్రసారం చేసిన కధనంతో సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ‘హర్ట్’ అవగా, ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కధనంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‘హర్ట్’ అయ్యారు. దీని గురించి బీఆర్ఎస్ పార్టీ రచ్చరచ్చ చేసింది.
సరిగ్గా కీలకమైన మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగిన ఈ వివాదం, ఇద్దరు సీనియర్ మంత్రులపై ఇంత తీవ్ర ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రంగా నష్టం కలిగిస్తాయి.
ముఖ్యంగా భట్టి, కోమటిరెడ్డి మద్య గొడవ పెరిగి పెద్దదైతే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మంత్రులు ఇద్దరూ ఎన్టీవీ, ఆంధ్యజ్యోతిలతో యుద్ధం మొదలుపెట్టినా, ఒకవేళ ఆ రెండు న్యూష్ చానల్స్ మంత్రుల వెంటపడినా ఇంకా రచ్చరచ్చవుతుంది.
కానీ హటాత్తుగా వారి విమర్శలు, పోరాటాలు అన్నీ నిలిచిపోయాయి! ఇప్పుడు అసలు ఏమీ జరగనట్లు అంతా సాఫీగా సాగుతోంది!
భట్టి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సిఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి నిన్ననే నల్గొండ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి ఏం మాయ చేశారో… ఏం మంత్రదండం తిప్పారో కానీ ఈ సమస్యలన్నిటినీ మంత్రం వేసినట్లు మాయం చేసి అందరితో కలిసి హుషారుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రోజుల వ్యవధిలో ఇంత మార్పు ఎలా సాధ్యం? మంత్రం దండం ఏమైనా ఉందేమో?






