తెలంగాణ ఉద్యమ సమయంలో, తర్వాత కేసీఆర్ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాలను, పార్టీలను, ప్రజలు అందరినీ తన చెప్పుచేతలలో ఉంచుకోవడానికి ‘తెలంగాణ సెంటిమెంట్’ సృష్టించి దానిని పెంచి పోషించారు. బీఆర్ఎస్ పార్టీ నేటికీ దాని ఫలాలే ఆరగిస్తోంది. ఇక ముందు కూడా దాంతోనే ముందుకు సాగుతుంది.
కనుక కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ ఈ ‘తెలంగాణ సెంటిమెంట్’ని బ్రేక్ చేస్తే తప్ప రాష్ట్రంలో మరెవరూ అధికారంలోకి రాలేరని సిఎం రేవంత్ రెడ్డి ఒక్కరే బాగా గ్రహించారు. కనుక 2023 శాసనసభ ఎన్నికలలో దానిని ‘సూపర్ సిక్స్’తో బ్రేక్ చేయాగాలిగారు. కనుకనే అధికారంలోకి రాగలిగారు.
కానీ ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ అధికారం కాపాడుకోవాలంటే ఈ సెంటిమెంట్ పిలకలు ఎప్పటికప్పుడు కత్తిరిస్తూనే ఉండాలని కూడా సిఎం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు.
ఆ ప్రయత్నంలోనే కేసీఆర్కి అత్యంత పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.
కేసీఆర్ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, అవినీతి, అక్రమాలు వెలికితీస్తూ అందరూ అనుకున్నంత ఆణిముత్యాలు కారు బీఆర్ఎస్ పార్టీ నేతలని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ విచారణలు ముందుకు సాగకుండా కేసీఆర్ బ్రేకులు వేయించగలిగారు.
ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో అంతకంటే తీవ్రమైన నేరమైన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణని వేగవంతం చేశారు. కానీ కేసీఆర్ని రేవంత్ రెడ్డి టచ్ చేయలేరని, చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లే అని కేటీఆర్, హరీష్ రావు హెచ్చరించారు.
ఈ కేసులతో కేసీఆర్ సృష్టించిన తెలంగాణ సెంటిమెంట్ బ్రేక్ చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, దాంతోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని కట్టడి చేస్తుండటం విశేషం.
కనుక కృష్ణా గోదావరి నదుల్లో నీళ్ళు పారుతున్నంత కాలం, చంద్రబాబు నాయుడు జీవించి ఉన్నంత వరకు కేసీఆర్ సృష్టించిన ఈ సెంటిమెంటుని బ్రేక్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఒకవేళ బ్రేక్ చేసినా దాంతో రాజకీయాలు చేయకుండా బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడం ఎవరి తరం కాదనే చెప్పాలి. ఒక రాజకీయ పార్టీకి ఎల్లకాలం ఉపయోగించుకోగల ఇలాంటి విజయవంతమైన ఫార్ములా కనిపెట్టడం ఎవరికైనా సాధ్యమేనా?






