తెలంగాణకు హైదరాబాద్‌, ఆంధ్రాకి విశాఖ… అక్షయపాత్రలే!

Hyderabad for Telangana, Visakhapatnam for Andhra Pradesh

విశాఖ రాజధాని అంటూ జగన్‌ 5 ఏళ్ళు కాలక్షేపం చేయగా, విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంధ్రా జిల్లాలు అభివృద్ధి అవుతాయంటూ ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద రావు, గుడివాడ అమర్నాధ్ వంటివారు వితండవాదం చేస్తూ కాలక్షేపం చేసేశారు. ఎన్నికలకు ముందు కొన్ని ఓడరేవులకు, భోగాపురం విమానాశ్రయానికి రెండోసారి శంకుస్థాపన చేసి మమ అనిపించేశారు.

ADVERTISEMENT

కానీ టిడిపి కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తయ్యేలోగా సిఎం చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించి నగరాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి జిల్లా అధికారులతో చర్చించారు. కొన్ని పనులకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు కూడా.

ఇప్పుడు మంత్రి నారా లోకేష్‌ విశాఖలో సిఐఐ అధ్వర్యంలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమి‌ట్‌లో పాల్గొన్నారు. ఈ సదస్సులో మాట్లాడుతూ, “త్వరలోనే కొత్త ఐ‌టి పాలసీని ప్రకటిస్తాము. విశాఖా నగరానికి మళ్ళీ ఐ‌టి కంపెనీలు, పరిశ్రమలు రప్పిస్తాము.

నగరంలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా కొత్తగా ఫ్లైఓవర్లు నిర్మిస్తాము. త్వరలోనే విశాఖకు కార్గో ఫ్లైట్ సర్వీసులు ప్రారంభించేందుకు విమానయన సంస్థలతో మాట్లాడుతాము. విశాఖ అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదిగేందుకు అవసరమైనవన్నీ ఉన్నాయి. వాటిని మరింత అభివృద్ధి చేసుకుని వినియోగించుకోవచ్చు,” అని మంత్రి నారా లోకేష్‌ అన్నారు.

విశాఖ బీచ్, భీమిలి బీచ్, ఋషికొండ బీచ్, కైలాసగిరి, అరుకు, లంబసింగి, బొర్రా గుహలు వంటి అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. కేవలం వాటిని అభివృద్ధి చేసుకున్నా ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించేది. కానీ జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు.

అన్నవరం, సింహాచలం, కనకమహాలక్ష్మి గుడి, భీమిలి నరసింహస్వామివారి ఆలయం, విజయనగరం జిల్లాలో పైడితల్లమ్మవారి ఆలయం, నెల్లిమర్ల శ్రీరామాలయం, శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం, శ్రీకూర్మం వంటి అనేక సుప్రసిద్ద ఆలయాలున్నాయి. అవన్నీ కూడా పర్యాటక ఆకర్షణ కేంద్రాలే. వాటినీ జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు.

విశాఖలో అచ్యుతాపురంలో ఫార్మా తదితర పరిశ్రమలున్నాయి. కనుక మరిన్ని పరిశ్రమలు రప్పించగలిగితే వాటితో ఉద్యోగాలు, ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చి ఉండేవి. కానీ జగన్‌ ప్రభుత్వం వాటినీ పట్టించుకోలేదు.

విశాఖలో భారీ నౌకాశ్రయం (పోర్ట్), విమానాశ్రయం, (కొత్తగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా సిద్దం అవుతోంది), రైల్, రోడ్ కనెక్టివిటీ ఉన్నాయి. అటు ఉమ్మడి గోదావరి జిల్లాలకు, ఇటు ఉమ్మడి ఉత్తరాంధ్రా జిల్లాలకు మద్యలో విశాఖ నగరం ఉంది.

ఇన్ని సానుకూల అంశాలున్న విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదిగేందుకు అవసరమైనవన్నీ ఉన్నాయని అర్దమవుతూనే ఉంది. అయినా గత 5 ఏళ్ళలో జగన్, మంత్రులు విశాఖ రాజధాని పేరుతో కాలక్షేపం చేశారు తప్ప విశాఖని అభివృద్ధి చేయలేకపోయారు.

ఇన్ని వనరులున్న విశాఖని టిడిపి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలిగితే, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ నగరం ఏవిదంగా ఆర్ధికశక్తిగా నిలుస్తోందో, అదేవిదంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అవసరమైన ఆర్ధికవనరుని విశాఖ నగరం అందించగలదు.

ADVERTISEMENT
Latest Stories