చాలా ప్రాంతీయ పార్టీలలో ఉండే అవలక్షణమే వైసీపీలో కూడా ఉంది. ఆ పార్టీకి బలం, బలహీనత రెండూ కూడా సిఎం జగన్మోహన్ రెడ్డే. ఆయన మొహం చూసే ప్రజలు వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చారు.
ఒకవేళ ఆయన ఆలోచనలు, విధానాలు, తీసుకొనే నిర్ణయాలు ప్రజలకు నచ్చితే మళ్ళీ ఆయనకే అంటే వైసీపీకే రెండో ఛాన్స్ కూడా ఇస్తారు. అందుకే ‘నేను బటన్ నొక్కి సంక్షేమ పధకాలకు నిధులు విడుదల చేస్తున్నాను. ఒంటరిగా పోరాడుతున్న మీ ఈ బిడ్డని గెలిపించండి,” అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజలను కోరుతుంటారు.
అంటే తన మొహం చూసి వైసీపీ ఎమ్మెల్యేలకు ఓట్లు వేయాలని కోరుతున్నట్లు అర్దమవుతోంది. కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలిచినా, ఓడినా అందుకు పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే అని అర్దమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తాము నిమిత్తమాత్రులమని, జగనన్నే సర్వస్వం అని చెప్పుకొంటుంటారు.
అయితే ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని జగన్ పదేపదే హెచ్చరిస్తుండటం ఆసక్తికరం. వారిలో 18 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, అక్టోబర్లో వారి సంగతి తేల్చేస్తానని హెచ్చరించారు కూడా. వచ్చే ఎన్నికలలో కూడా వైసీపీని ‘గెలిపించే కాంట్రాక్ట్’ తీసుకొన్న ఐప్యాక్ నివేదిక ఆధారంగానే ఆ 18 మందిని ‘సెలెక్ట్’ చేసిన్నట్లు వేరే చెప్పక్కరలేదు.
అయితే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన, విధానాలు, నిర్ణయాలు చూసి ఓట్లు వేస్తున్నప్పుడు, ఐప్యాక్ ఆయన పాలనపైనే సర్వే చేసి నివేదిక రూపొందించాల్సి ఉండగా, ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్ళడాన్నే ప్రామాణికంగా తీసుకొని వారి పనితీరుని మదించి నివేదికలు ఇస్తుండటం, దానిని పట్టుకొని జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరిస్తుండటం రెండూ విడ్డూరంగానే ఉన్నాయి కదా?
ఉదాహరణకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలేదంటూ తరచూ వైసీపీ ఎమ్మెల్యేలు పిర్యాదులు చేస్తుండటం వింటూనే ఉన్నాము. ఒకవేళ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా వారు నియోజకవర్గాలను అభివృద్ధి చేయకపోతే అప్పుడు వారి పనితీరు సరిగ్గాలేదని ఐప్యాక్ నివేదిక ఇస్తే సబబుగానే ఉంటుంది.
కానీ ఎమ్మెల్యేలు ఏం పని చేశారనే దానిని బట్టి కాక నియోజకవర్గంలో గడప గడపకి తిరుగుతున్నారా లేదా?అనే దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని వారి పనితీరుని ఐప్యాక్ లెక్కకడుతుండటం చాలా విచిత్రంగా ఉంది కదా?
అలాగే నానాటికీ పెంచుతున్న విద్యుత్ బిల్లులు, ఇంటి పన్నులు, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, కరెంటు కోతలు, నిరుద్యోగ సమస్య వంటి అంశాలతో ఎమ్మెల్యేలకు ఎటువంటి సంబందమూ ఉండదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలు, తీసుకొనే నిర్ణయాలను బట్టే అవన్నీ ఉంటాయి. అటువంటప్పుడు ఐప్యాక్ సర్వే చేయాల్సింది జగనన్న పాలన ఏవిదంగా ఉందని కదా? కానీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేస్తోంది!అంటే ఐప్యాక్కు కోట్లు రూపాయలు ముట్టజెపితే అది కూడా పిల్లి మెడలో గంట కట్టే ధైర్యం లేక ఎమ్మెల్యేల మెడలో కట్టేస్తూ జగనన్నకు శల్యసారధ్యం చేస్తోందన్న మాట! శభాష్… శభాష్!



