క్రికెట్ ప్రపంచంలో ఇక ‘పసికూనలు’ అనే మాట ఉండేదేమో! ఎందుకంటే… చిన్న జట్లుగా పరిగణించే జట్లన్నీ అగ్ర జట్లకు భారీ షాక్ లను ఇస్తూ నివ్వెరపరుస్తున్నాయి. శుక్రవారం నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడిన న్యూజిలాండ్ జట్టుకు బంగ్లా భారీ షాక్ ఇవ్వగా, మరో పక్కన ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ ను ప్రారంభించిన విండీస్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ప్రారంభమైన తొలి వన్డేలో 63 పరుగుల భారీ విజయంతో విండీస్ పై జయకేతనం ఎగురవేసింది ఆఫ్ఘనిస్తాన్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. జావేద్ అహ్మది 81 పరుగులు చేయగా, చివర్లో నైబ్ 41 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా రాబట్టగలిగింది. లక్ష్యచేధనలో విండీస్ కష్టాలు రెండవ ఓవర్ నుండే ప్రారంభమయ్యాయి.
ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున బరిలోకి సత్తా చాటిన స్పిన్నర్ రషీద్ ఖాన్ దెబ్బకు పెవిలియన్ బాట పట్టడం విండీస్ బ్యాట్స్ మెన్ల వంతయ్యింది. 8.4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చిన రషీద్ ఖాన్ ఏకంగా 7 వికెట్లను తన ఖాతాలో వేసుకుని, వెస్టీండీస్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. అయితే ఆఫ్ఘన్లు ఇలా పెద్ద జట్లకు షాక్ ఇవ్వడం ఇదే ప్రధమం కాదు, గతంలో వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టును కూడా మట్టికరిపించిన చరిత్ర ఆఫ్ఘన్ల సొంతం.



