అంతరిక్షం, క్షిపణుల తయారీ రంగాలలో భారత్ అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి ఎదిగి చాలా కాలమే అయ్యింది. ఇస్రో అనేక ఉపగ్రహ్రాలను, ఉపగ్రహ వాహక నౌకలను తయారుచేసి విజయవంతంగా ప్రయోగిస్తూనే ఉంది. యూపీలో తయారైన బ్రహ్మోస్ క్షిపణులనే ‘ఆపరేషన్ సిందూర్’లో ప్రయోగించారు. తేజస్ యుద్ధ విమానాలు, చేతక్ హెలికాఫ్టర్లు కూడా భారత్లోనే తయారవుతున్నాయి.
ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రైవేట్ రంగంలో కూడా ఏరో స్పేస్, డిఫెన్స్ పరికరాలు తయారవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లోని స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ అంతరిక్ష రాకెట్ విక్రమ్-1 తయారు చేసి శ్రీహరికోటకి పంపింది.
ఏపీలో తిరుపతి జిల్లా ఏరో స్పేస్ హబ్, కడప జిల్లా డ్రోన్ హబ్గా అభివృద్ధి చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ‘డ్రోన్ టాక్సీ’ ఇప్పటికే తయారైంది. ప్రస్తుతం ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతున్నాయి. బహుశః వచ్చే ఏడాదిలో భారత్లో డ్రోన్ టాక్సీ సర్వీసులు కూడా అందుబాటులో రావచ్చు.
దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో రవాణా విమానం కూడా తయారైంది. గుజరాత్లోని వడోదరాలో ప్రఖ్యాత టాటా కంపెనీకి చెందిన ‘టాటా ఎయిర్ బస్ ఫైనల్ అసెంబ్లీ లైన్’లో తయారైన తొలి రవాణా విమానం సి-295 నాలుగు రోజుల క్రితం బయటకు వచ్చింది.
స్పెయిన్ దేశం సహకారంతో వడోదరాలో ఏర్పాటయిన ఈ ఫైనల్ అసెంబ్లీ ప్లాంట్ని 2024లో ప్రధాని మోడీ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచేజ్ కలిసి ప్రారంభించారు. రెండేళ్ళలోనే తొలి విమానం బయటకు వచ్చింది.
భారత్ వాయుసేన కోసం మొత్తం 56 విమానాలు ఆర్డర్ చేసి వాటిలో 16 విమానాలు నేరుగా స్పెయిన్ నుంచి కొనుగోలు చేస్తోంది. కానీ ఆ ఒప్పందం ప్రకారం ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా మిగిలిన 40 రవాణా విమానాలు వదోదరాలో తయారు చేయాల్సి ఉంటుంది. వాటిలో మొట్ట మొదటి రవాణా విమానమే సి-295 తయారై బయటకు వచ్చింది.
ఈ విమానం తయారీకి అవసరమైన విడి భాగాలలో 70 శాతం భారత్లో తయారైనవే. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గల 37 కంపెనీలలో తయారైన 13,000 విడిభాగాలను ఈ విమాన తయారీలో ఉపయోగించారు. కనుక నూటికి నూరు శాతం దేశీయ సాంకేతిక పరిజ్ఞానం, విడి భాగాలతో ప్రజారవాణా, సరుకు రవాణా విమానాలు తయారుచేసే రోజు మరి ఎంతో దూరంలో లేదు.
Congratulations #TataAdvancedSystems C295#AtmanirbharBharat pic.twitter.com/FtsFscBsS1
— Dr. Ajayshree Singh Sambyal (@AjayshreeSamby3) May 11, 2026




