భారతీయులందరికీ ఒక శుభవార్త. ఒకనాడు బ్రిటీష్ పాలకుల కబంధ హస్తాల్లో చిక్కుకుని శతాబ్దాల పాటు అవస్థలు పడి, ఆపై పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్న ఇండియా,ఇప్పుడు అదే బ్రిటన్ ను మించిన శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దాదాపు 100 సంవత్సరాలుగా టాప్-6 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న బ్రిటన్ ను తాజాగా ఇండియా అధిగమించి సరికొత్త చరిత్రను లిఖించింది.
స్థూల జాతీయోత్పత్తిలో ఇండియా బ్రిటన్ ను దాటి ఓ అడుగు ముందుకేసింది. ఇప్పుడిక అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ తరువాతి స్థానం ఇండియాదే. ఇండియాలో శరవేగంగా అభివృద్ధి నమోదవుతుండటం, బ్రెగ్జిట్ తరువాత బ్రిటన్ లో నెలకొన్న మాంద్యం కారణంగానే, ఇండియా ఓ మెట్టు ఎక్కగా, బ్రిటన్ క్రిందికి వెళ్ళినట్లుగా ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు.
ఆర్థిక పరిభాషలో అయితే 2016 సంవత్సరం ఇండియాకు అత్యంత శుభ ఫలితాలను అందించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రపంచంలోనే వేగంగా పరిగెడుతున్న ఎకానమీగా చైనాను భారత్ దాటేసింది. ఆపై అక్టోబర్ లో ఐఎంఎఫ్ ఇండియాకు కితాబిస్తూ, ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేయనున్న దేశం ఇండియానేనని తెలిపింది.2017లో జీడీపీ 7.6 శాతానికి పెరగనుందని వెల్లడించింది.
ఇదే సమయంలో బ్రిటన్ వృద్ధి ఈ సంవత్సరంలో 1.8 శాతంగా, వచ్చే సంవత్సరంలో 1.1 శాతంగా మాత్రమే ఉంటుందని వచ్చిన అంచనాలు ఆ దేశపు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయని నిపుణులు వ్యాఖ్యానించారు. బ్రిటన్ కరెన్సీ విలువ పతనం కారణంగా జీడీపీ కుంచించుకుపోయిందని ఆర్ధికవేత్తలు పేర్కొన్నారు. తాజా పరిణామాలతో నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై ప్రముఖ బిజినెస్ మేగజైన్ ‘ఫోర్బ్స్’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. గడచిన పాతికేళ్లుగా ఇండియాలో వృద్ధి శరవేగంగా సాగుతుండటంతో పాటు నాటకీయ పరిణామాలు భారత్ ను టాప్-6లోకి చేర్చాయని వెల్లడించింది. అంతకుమించి యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని తీసుకున్న నిర్ణయం ఆ దేశపు ఆర్థిక బలాన్ని దెబ్బతీసిందని పేర్కొంది.
నిజానికి 2020లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను ఇండియా అధిగమిస్తుందని లెక్కలు కట్టారు. అయితే, బ్రెగ్జిట్ తరువాత బ్రిటన్ పౌండ్ దాదాపు 20 శాతం పడిపోవడంతో అనుకున్న సమయం కన్నా ముందుగానే భారత్ ఆ ఘనతను సాధించింది. ప్రస్తుతం యూకే జీడీపీ 1.87 ట్రిలియన్ పౌండ్లు (ఒక డాలర్ తో 0.81 పౌండ్ల మారకంపై 2.29 ట్రిలియన్ డాలర్లు) కాగా, భారత జీడీపీ 153 ట్రిలియన్ రూపాయలు (ఒక డాలర్ 66.6 రూపాయల మారకపు విలువపై 2.30 ట్రిలియన్ డాలర్లు)గా ఉందని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య ప్రస్తుతం తేడా స్వల్పంగా ఉన్నప్పటికీ, ప్రతి ఏటా ఒకటి నుంచి రెండు శాతం వరకూ పెరుగుతూ ఉండవచ్చని అంచనా వేసింది.



