ఇరాన్ మీద దాడి చేసిన మొదటి గంటలోనే ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా ఖమేనీని మట్టుపెట్టామని ట్రంప్ జబ్బలు చరుచుకున్నారు. కానీ ఏం జరిగింది?అయన కంటే చాలా దూకుడుగా వ్యవహరించే, యుద్ధ వ్యూహాలలో చాలా ఆరితేరిన అయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఈ యుద్ధం అందుకునేలా చేసింది.
అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఆయన తల్లితండ్రులు, భార్య, కొడుకు, అక్క, బావ, వారి పిల్లలు అందరూ చనిపోయారు. కనుక మొజ్తబా ఖమేనీ తీవ్ర ప్రతీకారేచ్చతో రగిలిపోతూ ఈ యుద్ధం చేస్తున్నారు. కనుక ఆయన యుద్ధం మామూలుగా లేదు.
ఆయన పగ్గాలు చేపట్టగానే ఎప్పటికప్పుడు యుద్ధ వ్యూహాలు మార్చేస్తూ అమెరికా, ఇజ్రాయిల్ దళాలను ముప్ప తిప్పలు పెడుతున్నారు. వాటితో ప్రత్యక్ష యుద్ధం చేసి గెలవలేమని గ్రహించిన మొజ్తబా ఖమేనీ, ప్రపంచ చమురు సరఫరాకి కీలకమైన హర్మూజ్ జలసంధిని తన అధీనంలో తెచ్చుకొని చమురు నౌకలపై దాడులు చేయడం ప్రారంభించారు.
అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించిన గల్ఫ్ దేశాల చమురు బావులపై క్షిపణులతో విరుచుకు పడుతున్నారు.
అమెరికా వద్ద అత్యంత శక్తివంతమైన బాంబులు, క్షిపణులు ఉన్నాయని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటూ వాటిని పంపిస్తుంటే, లక్షల డాలర్లు విలువ చేసే వాటిని చాలా తక్కువ ఖర్చుతో ఇరాన్ డ్రోన్లపై వాటిని ప్రయోగించేలా చేసి నష్టం కలిగిస్తున్నారు.
ఆ డ్రోన్లను కూల్చకపోతే వచ్చి మీద పడి విధ్వంసం సృష్టిస్తాయి. అలాగని కూల్చాలంటే లక్షల డాలర్ల ఖరీదైన క్షిపణులను వాటిపై ప్రయోగించాల్సి వస్తోంది.
హర్మూజ్ జలసంధిలో కూడా ఇరాన్ ఇదే ఫార్ములా ప్రయోగించి అమెరికా యుద్ధ నౌకలు ప్రవేశించకుండా కట్టడి చేస్తోంది. తక్కువ ఖర్చుతో సుమారు 1,500కి పైగా చిన్నచిన్న మరబోట్లు దండుని సిద్ధం చేసి ఉంచారు.
పెద్ద యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు వాటిని పసిగట్టి దాడి చేసినా వాటి వల్ల ఇరాన్కు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ అవి అమెరికాకు చెందిన ఒక్క యుద్ధనౌకని దెబ్బ తీసినా ఆ నష్టం భరించడం చాలా కష్టం.
హర్మూజ్ జలసంధిలో సముద్రం అడుగున కూడా ఇరాన్ మైన్స్ ఏర్పాటు చేయడంతో అమెరికా యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు అక్కడికి వచ్చేందుకు భయపడుతున్నాయి.
ఇరాక్తో ఏకధాటిగా 8 ఏళ్ళు యుద్ధం చేసిన అనుభవం ఇరాన్కుంది. ఆ అనుభవంతోనే ఇలాంటి అనేక యుద్ధ వ్యూహాలు నేర్చుకొని అమలు చేస్తోంది.
కేవలం ట్రంప్ దుందుడుకుతనం వల్లనే అడుసు తొక్కారు. ఇప్పుడు కాలు కడుక్కోవాలన్నా ఇరాన్ అనుమతి కావాల్సిందే.
ఎలా అంటే, ఇరాన్పై వేసిన ప్రతీ బాంబులతో ఇరాన్కు జరిగిన నష్టం కంటే, ఈ యుద్ధం కొనసాగుతున్న ప్రతీరోజూ తామే ఎక్కువ మూల్యం చెల్లిస్తున్నామని ట్రంప్కి అర్దమైనట్లే ఉంది. అందుకే “మేము గెలిచాము… ఇక ఈ యుద్ధం ముగిద్దాం” అంటున్నారు.
కానీ ‘అమెరికా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని మేమేముగిస్తామని’ ఇరాన్ మొదటి నుంచి చెపుతూనే ఉంది. కనుక ఈ యుద్ధం ముగించాలంటే అమెరికాకు ఇరాన్ మూడు షరతులు విధించింది.
ఇరాన్ షరతులు: 1. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వలన ఇరాన్కు కలిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలి. 2. ఇరాన్ మీద మళ్ళీ ఇలా దురాక్రమణలకు పాల్పాడమని అంతర్జాతీయ హామీ ఇవ్వాలి. 3. సార్వభౌమత్వాన్ని, హక్కులను గౌరవించాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ట్వీట్ చేశారు. అంటే ఎవరు గెలిచినట్లు?




