ఒకప్పుడు భారత్లో జనాభా చాలా ఎక్కువని… నిరక్షరాస్యులు, పేదరికం, మూఢాచారాలు ఎక్కువని అభివృద్ధి చెందిన దేశాలు విమర్శిస్తుండేవి. కానీ ఇప్పుడు అవే దేశాలు ప్రపంచంలోకెల్లా ఎక్కువ జనాభా ఉన్న భారత్ అతిపెద్ద మార్కెట్ అని గుర్తించి మన దేశంలో వ్యాపారాలు చేసేందుకు పోటీపడుతున్నాయి.
ఒకప్పుడు భారత్ని అవహేళన చేసిన దేశాలే ఇప్పుడు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టమని ఇస్రోకి పంపిస్తున్నాయి. కరోనా సమయంలో అమెరికాతో సహా పలు అభివృద్ధి చెందిన దేశాలకు కూడా భారత్ మందులు, వాక్సిన్లు అవసరమయ్యాయి.
భారత్లో ఉన్న అపారమైన సహజ, మానవ వనరులు, వ్యాపార అవకాశాలు ఏవిదంగా అందిపుచ్చుకోవాలా… అని చూస్తున్నాయి. భారత్ కూడా అన్నిదేశాలతో సఖ్యతగానే ఉంటోంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ముందుకు సాగుతోంది.
కానీ కెనడా ప్రధాని ట్రూడో మాత్రం భారత్పై విషం కక్కుతున్నారు. భారత్కి చాలా దూరంగా ఉన్న కెనడాకు భారత్తో శతృత్వం అవసరమా?అంటే కాదనే అర్దమవుతుంది. కానీ కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుండటమే కాక, హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే తీవ్రవాది అక్కడి గ్యాంగ్ వార్లో చనిపోతే దానికి భారత్ని నిందిస్తూ, ఆంక్షలు విదిస్తామని బెదిరిస్తోంది.
ఆనాడు భారత్ అణ్వస్త్రం ప్రయోగం చేసినప్పుడు ఆ తర్వాత పలు సందర్భాలలో అగ్రరాజ్యాలు భారత్పై ఆంక్షలు విధించాయి. కానీ వాటి వలన భారత్ అన్ని రంగాలలో మరింత స్వయంప్రతిపత్తి సాధించి అభివృద్ధి చెందుతోందని గ్రహించి ఆ ఆంక్షలు వెనక్కు తీసుకున్నాయనే సంగతి కెనడా మరిచిన్నట్లుంది.
భారత్పై ద్వేషంతో వేర్పాటువాదులకు ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్ చివరికి వారివలననే సర్వనాశనం అయ్యింది. పాకిస్తాన్ చేసిన ఆ తప్పునే ఇప్పుడు అభివృధ్ది చెందిన కెనడా కూడా చేస్తోంది. కనుక ఈ తప్పుడు విధానం, తప్పుడు ఆలోచనలతో కెనడాయే నష్టపోతుంది తప్ప భారత్ కాదు.
పాకిస్తాన్లో తలదాచుకున్న బిన్ లాడెన్ని అమెరికా వెతికి వేటాడి చంపేసింది. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేస్తే వారిని ఇజ్రాయెల్ సైనికులు వేటాడి చంపేస్తున్నారు. ఇరాన్ దాడి చేస్తే ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తోంది. వారి గొడవలతో అమెరికాకు ఏ సంబంధం లేకపోయినా ఇజ్రాయెల్కు సాయపడుతోంది. ఇవన్నీ కెనడా ప్రధాని ట్రూడోకి తప్పుగా అనిపించడం లేదు. కనీసం కళ్ళకి కనిపించిన్నట్లు కూడా లేదు. కానీ తమ గడ్డ మీద భారత్ ద్రోహులకు ఆశ్రయం కల్పిస్తూ తిరిగి భారత్ని నిందిస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్గా అవతరించిన భారత్పై ఆంక్షలు విధించి దూరం చేసుకుంటే నష్టపోయేది కెనడాయే కానీ భారత్ ఎంత మాత్రం కాదని గ్రహించేసరికి చాలా ఆలస్యం కావచ్చు. అప్పుడు ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు.




