ఇదివరకు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటూ షూటింగ్ విరామంలో జనసేనతో రాజకీయాలు చేస్తుండేవారు. అందుకు అయన బలమైన కారణమే చెప్పుకున్నారు. తన వద్ద జగన్లాగ లక్షల కోట్ల ఆస్తులు లేవని కనుక జనసేన పార్టీ నిర్వహణ ఖర్చుల కోసం తప్పనిసరిగా సినిమాలు చేయాల్సి వస్తోందని వివరించారు.
అలాగే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హైదరాబాద్లో ఉంటూ ఏపీ రాజకీయాలలో పాల్గొంటునప్పుడు వైసీపీ నేతలు వారు ముగ్గురూ పార్ట్-టైమ్ రాజకీయనాయకులని విమర్శించేవారు.
కానీ ఇప్పుడు వారి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అచ్చం అలాగే పార్ట్-టైమ్ రాజకీయాలు చేస్తున్నారు. అయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కానీ శాసనసభ సమావేశాలకు హాజరవడం లేదు. తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదనే ఓ కుంటి సాకు చెప్పుకుంటున్నారు… బాగానే ఉంది. కానీ జగన్ ప్రజలలోకి వెళ్ళడానికి ఎటువంటి హోదా అవసరం లేదు కదా?
కానీ జగన్ ఎక్కువ సమయం బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చిపోతున్నారు. పులివెందుల పర్యటన ముగించుకొని నేడు మళ్ళీ బెంగళూరు తిరుగు ప్రయాణం అవుతుండటం చూస్తే, ఆయన మన రాష్ట్ర రాజకీయ నాయకుడా లేదా కర్ణాటక నాయకుడా?అనే సందేహం కలుగుతుంది.
ఒకవేళ జగన్ ఏపీకి వచ్చినా ప్రజల మధ్యకు వెళ్ళకుండా తాడేపల్లి ప్యాలస్లోనే కాలక్షేపం చేస్తుంటారు. ఏపీ అంటే తాడేపల్లి ప్యాలస్ మాత్రమే కాదు. కనుక ప్యాలస్లో కూర్చొని రాజకీయాలు చేస్తూ ఏపీ రాజకీయాలలో ఉన్నానని అనుకోవడం అతిశయోక్తే అవుతుంది కదా?
అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఇలా వ్యవహరిస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు? ప్రతిపక్షనాయకుడు ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కరించాలి.
జగన్ ఆ బాధ్యతని విస్మరించినా కనీసం వైసీపీని కాపాడుకోవాలి కదా? వైసీపీ నేతలు కేసులలో జైళ్ళకు పోతుంటే, జగన్ అసలేమీ జరగనట్లు బెంగళూరు వెళ్ళి కాలక్షేపం చేస్తున్నారు. అధినేత, నాయకులు అందుబాటులో లేకుంటే పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏమిటి?అని ఎవరు ఆలోచించాలి… జగనే కదా?
టీడీపి, జనసేనలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఆ పార్టీల నేతలు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ జగన్ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వారు ప్రజల మద్యనే ఉంటూ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. కనుకనే ప్రజలకు, కార్యకర్తలు వారిపై అభిమానం, నమ్మకం ఏర్పడ్డాయి. అందువల్లే వారు, వారి పార్టీలు అధికారంలోకి రాగలిగాయి.
కానీ జగన్ బెంగళూరు లేదా తాడేపల్లి ప్యాలస్లో కాలక్షేపం చేస్తున్నారు. తాను ఎలా వ్యవహరించినా వచ్చే ఎన్నికలలో ప్రజలు తన మొహం చూసి వైసీపీని గెలిపించేస్తారనే ధీమా వల్లనే జగన్ ఈవిదంగా పార్ట్-టైమ్ రాజకీయాలు చేస్తున్నారేమో?




