చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకునేందుకే బుడమేరు గేట్లు ఎత్తేసి విజయవాడని ముంచేశారని ఆరోపించి జగన్ ఎంతగా నవ్వులపాలయ్యారో అందరూ చూశారు. బుడమేరు గండ్లు పూడ్చి విజయవాడలోకి వరద ప్రవాహాన్ని ఆపేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు ఎంతగా శ్రమించారో అందరూ చూశారు.
సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పూనుకొని చేపట్టిన సహాయ చర్యలను దేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ప్రశంశిస్తున్నారు. కానీ జగన్ మాత్రం బురద రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టిలో మరింత చులకనయ్యారు.
నిన్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఇంచుమించు అలాగే విమర్శలు గుప్పించారు. కానీ విలేఖరులు “మీ హయాంలో బుడమేరు, ఏలేరు పనులు పూర్తి చేయకపోవడం వలననే వరదలు వచ్చాయని టిడిపి నేతల విమర్శలకు ఏం సమాధానం చెపుతారని” ప్రశ్నించగా, జగన్ సమాధానం చెప్పి అడ్డంగా దొరికిపోయారు.
“అవును మేము అధికారంలో ఉన్నప్పుడు వాటి పనులు చేయించలేకపోయాము. ఎందుకంటే ఆ సమయంలో బుడమేరు, ఏలేరు నిండుగా ప్రవహిస్తుండేవి. అటువంటి సమయంలో మరమత్తులు, కాలువల లైనింగ్ పనులు చేయడం సాధ్యం కాదు. చేయాలంటే నీళ్ళు నిలిపివేసి క్రాప్ హాలీడే ప్రకటించి, చేయాల్సి వస్తుంది.
కానీ వాటిలో కొంత తక్కువగానైనా నీళ్ళు పారుతున్నప్పుడు మరమత్తులు ఎందుకని చేయించలేదు. తర్వాత ఎప్పుడైనా వర్షాలు కురవనప్పుడు చేయొచ్చులే అని వాటిని అలాగే వదిలేశాము,” అని తమ హయాంలో ఏ పని చేయలేదనే విషయం జగన్ స్వయంగా తన నోటితోనే చెప్పేశారు.
జగన్ ప్రభుత్వం ఏమీ ఏడాదో రెండేళ్ళో అధికారంలో లేదు పూర్తి 5 ఏళ్ళు ఉంది. కానీ 5 ఏళ్ళలో వాటికి మరమత్తులు చేయడానికి అవకాశమే చిక్కలేదని సమర్ధించుకోవడం సిగ్గుచేటు. ఓ పక్కన కుండపోతగా వర్షం కురుస్తుంటే మరోపక్క బుడమేరు ఉదృతంగా ప్రవహిస్తుంటే కేవలం వారం రోజులలోనే మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు గండ్లు పూడ్పించగలిగినప్పుడు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్న జగన్ వాటికి మరమత్తులు, లైనింగ్ పనులు చేయలేకపోవడాన్ని ఏమనుకోవాలి?
జగన్ ప్రభుత్వం ప్రాజెక్ట్ గేట్లకు గ్రీజే పెట్టలేదు ఇంక మరమత్తులు ఏమి చేయిస్తుందన్న వైఎస్ షర్మిల విమర్శలను జగన్ కాదనగలరా?




