జగన్‌, కేసీఆర్‌ సింహాలే… బోనులోకి ఎప్పుడొస్తారో?

kcr_jagan

జగన్‌కి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి కానీ శాసనసభ సమావేశాలు రారు. తాడేపల్లి ప్యాలస్‌ నుంచి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయగలరు. కానీ కూతవేటు దూరంలో ఉన్న శాసనసభకు రారు.

ఎన్నికలకు ముందు సింగిల్ సింహం… తోడేళ్ళ గుంపు, అర్జునుడు, పద్మవ్యూహం, చేతులు మడతపెట్టి యుద్ధం…సిద్దం అంటూ ప్రగల్భాలు పలికిన జగన్మోహన్‌ రెడ్డి శాసనసభ సమావేశాలకు వచ్చేందుకు భయపడుతున్నారు. జగన్‌ శాసనసభకు రారు కానీ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని మీడియా సమావేశం పెట్టి సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలన్నీ అబద్దాలు… ప్రజలను మోసగించేవే అని అర్ధ తాత్పర్యాలు చెపుతుంటారు.

ADVERTISEMENT

నాడు శాసనసభ వైసీపి కౌరవ సైన్యాన్ని అంతా వయసులో కూడా చంద్రబాబు నాయుడు ఒక్కరే ధైర్యంగా ఎదుర్కొన్నారు. అలాగే కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్‌ రెడ్డితో సహా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అందరూ ధైర్యంగా శాసనసభ సమావేశాలకు హాజరయ్యేవారు.

కానీ తాను యువకుడినని మరో 20-30 ఏళ్ళు రాజకీయాలు చేసేందుకు ఆరోగ్యం, శక్తి సామర్ధ్యలు ఉన్నాయని గొప్పలు చెప్పుకునే జగన్‌ శాసనసభకు రావడానికి భయపడుతున్నారు.

అక్కడ తెలంగాణలో కేసీఆర్‌ కూడా ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలు ప్రధాని మోడీ, ఆంధ్రా తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి గురించి చాలా చులకనగా మాట్లాడుతుంటారు. కానీ ఆయన కూడా శాసనసభకు రమ్మంటే రావడం లేదు. మొన్న ఒక్కరోజు శాసనసభకు వచ్చి రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ని చీల్చి చెండాడేస్తానన్నారు. కానీ ఇవాళ్ళ శాసనసభకు రాకుండా మొహం చాటేశారు.

కనుక రేవంత్‌ రెడ్డి, మంత్రులు మళ్ళీ కేసీఆర్‌ ఎందుకు రాలేదని హరీష్ రావు, కేటీఆర్‌లను నిలదీస్తే వారు సమాధానం చెప్పలేక తడబడ్డారు.

అయితే కేసీఆర్‌ తాను వెళ్లకపోయినా తన ఎమ్మెల్యేలను శాసనసభకు పంపిస్తున్నారు. కానీ జగన్‌ మాత్రం తన ఎమ్మెల్యేలను కూడా శాసనసభకు పంపించడం లేదు.

అందుకే “బయట కూర్చొని విమర్శలు, ఆరోపణలు చేయడం కాదు… దమ్ముంటే శాసనసభకు వచ్చి మాట్లాడాలని” చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి వారికి సవాలు విసురుతున్నారు. అయినా తమ అంత రాజకీయ మేధావులు లేరని భావించే జగన్, కేసీఆర్‌ ఇద్దరూ శాసనసభకు వచ్చేందుకు భయపడుతున్నారు. పదవీ, అధికారం ఉంటేనే తమకు ధైర్యం ఉంటుందని లేకుంటే నలుగురిలోకి రావడానికి తమకు ధైర్యం ఉండదని జగన్, కేసీఆర్‌ చెప్పుతున్నారా?

ADVERTISEMENT
Latest Stories