ఉద్యోగాల భర్తీలోనూ రాజకీయాలే… అవే కొంప ముంచాయా?

KCR Jagan

ఉద్యోగాల భర్తీకి, రాజకీయాలకు, ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా? అంటే లేదనే చెప్పవచ్చు. కానీ ఏపీలో జగన్‌, తెలంగాణలో కేసీఆర్‌ ఇద్దరూ కూడా ఉద్యోగాల భర్తీని తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాలకు అంటే ఎన్నికలలో ఓట్లు రాల్చేందుకు వాడుకోవాలని అనుకున్నారు.

ADVERTISEMENT

దాని కోసం జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ ప్రక్రియని పూర్తి చేయకుండా ఏళ్ళ తరబడి సాగదీస్తూ ఎన్నికల వరకు నెట్టుకు వచ్చారు.

కేసీఆర్‌ కంటే ఘనుడు జగన్‌. అందుకే నాలుగున్నరేళ్ళు కాలక్షేపం చేసేసి ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయించి యువతని మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనుకున్నారు.

ఉద్యోగాల భర్తీ ప్రక్రియని కూపించి ఊరిస్తూ యువత ఓట్లు దండుకోవాలనుకుంటే, వారి మోసపూరిత ఆలోచనలను యువత బాగానే పసిగట్టి ఇద్దరినీ ఓడించి ఇంటికి పంపారు.

ఉద్యోగాల భర్తీ విషయంలో యువత మనోభావాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి గ్రహించారు. కనుకనే తాము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్‌ ప్రకటించి దాని ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియని నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వివిద కారణాలతో అర్దాంతరంగా నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియని పూర్తి చేస్తున్నారు.

జగన్‌ ప్రభుత్వం 2022, నవంబర్‌లో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రాధమిక వ్రాత పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారు. ఆ తర్వాత వారికి దేహ ధారుడ్య పరీక్షలు, వైద్య పరీక్షలు, తుది దశ వ్రాత పరీక్షలు నిర్వహించి వాటిలో అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు అందించి భర్తీ ప్రక్రియని పూర్తి చేయాలి.

కానీ జగన్‌ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ని సాకుగా చూపిస్తూ మిగిలిన ప్రక్రియ పూర్తిచేయకుండానే అధికారంలో నుంచి దిగిపోయింది.

ఈ ప్రక్రియ పూర్తి కాక మునుపే ప్రభుత్వం మారినందున ప్రాధమిక పరీక్షలో అర్హత సాధించినవారు తమ పరిస్థితి గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కానీ యువగళం పాదయాత్రలోనే నారా లోకేష్‌ నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియని వేగవంతం చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఆ ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో తదుపరి ప్రక్రియకి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర హోంమంత్రి అనిత వంగలపూడి మీడియాతో మాట్లాడుతూ, “ అర్హత సాధించిన అభ్యర్ధుల నుంచి వారం రోజులలోగా పీఎంటీ, పీఈటీ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ మొదలుపెడతాము. వాటిలో అర్హత సాధించినవారికి మూడో దశ వ్రాత పరీక్ష నిర్వహిస్తాము. ఈ నియామక ప్రక్రియ మొత్తం 5 నెలల్లో పూర్తిచేస్తాము,” అని చెప్పారు.

అంటే 2025, ఫిబ్రవరి-మార్చిలోగా ఎంపికైన అభ్యర్ధులు ఉద్యోగాలలో చేరబోతున్నారన్న మాట! నిబద్దత అంటే ఇదే కదా?

ADVERTISEMENT
Latest Stories