పోలింగ్ ముందు రోజు వరకు కూడా వైసీపి 175కి 175 సీట్లు గెలుచుకుంటుందని, అందరూ ‘సిద్దం’గా ఉండాలని రాష్ట్రమంతా జగన్ ఫోటోలతో పోస్టర్స్, ఫ్లెక్సీ బ్యానర్లు వేయించుకున్నారు.
కౌంటింగ్ ముందు రోజు 175కి 175లో కాస్త సవరణ చేసి “చాలా భారీ మెజార్టీతో గెలువబోతున్నాము… మన గెలుపు చూసి యావత్ దేశ ప్రజలు ఆశ్చర్యపోబోతున్నారని” జగన్ స్వయంగా చెప్పారు. తమకు అటువంటి ఘనా విజయం అందించేందుకు తోడ్పడిన ఐ-ప్యాక్ టీమ్కి జగన్ ధన్యవాదాలు చెప్పారు కూడా.
అంటే అప్పటి వరకు ఈవీఎంలు పనితీరుపై జగన్కు ఎటువంటి అనుమానాలు లేవని స్పష్టమవుతోంది. కానీ ఎన్నికలలో ఓడిపోగానే ఈవీఎంల వలననే తాము ఓడిపోయాము తప్ప ప్రజలు ఓడించడం వల్ల కాదని జగన్ వాదించడం మొదలుపెట్టారు.
ఇంకా గమ్మతైన విషయం ఏమిటంటే జగన్ ఏ ఈవీఎంలను అనుమానిస్తున్నారో వాటిలో నమోదైన ఓట్లనే చూపిస్తూ, తమ పార్టీకి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయని, అంటే రాష్ట్రంలో 40 శాతం మంది ప్రజలు మనవైపే ఉన్నారని, కనుక మనం పూర్తిగా ఓడిపోయిన్నట్లు కాదని జగన్ గట్టిగా వాదించారు.
ఓ పక్క ఈవీఎంలను వేలెత్తి చూపిస్తూ, మళ్ళీ వాటి లెక్కలనే చూపి తమ ఓటమిని సమర్ధించుకోవడం చాలా హాస్యస్పదంగా ఉంది కదా?
ఇంతకీ మళ్ళీ ఇప్పుడు ఈ ఈవీఎంల గోల ఎందుకంటే, వాటి గురించి మళ్ళీ జగన్, వైసీపి సోషల్ మీడియాలో దుష్ప్రచారం ప్రారంభించింది కనుక.
హర్యానా శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఈవీఎంల వలననే అనూహ్యంగా గెలిచిందని జగన్మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
కనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మళ్ళీ బ్యాలైట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, దేశంలో అన్ని పార్టీలు ఇందుకోసం కృషి చేయాలని జగన్ పిలుపునిచ్చారు.
వైసీపికి సొంత మీడియా, సోషల్ మీడియా ఉన్నాయి కనుక అవి జగన్ ఆలోచనలకు, కోరికలకు అనుగుణంగా దుష్ప్రచారం మొదలుపెట్టాయి.
కానీ దేశంలో ఎక్కడా లేనివిదంగా 175కి 175 సీట్లు తమకే వస్తాయని జగన్ ఏ ధీమాతో చెప్పారో అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నందున పోలింగ్ ప్రక్రియని చాలా సులువుగా మేనేజ్ చేయగలమని అనుకొని ఉండవచ్చు.
కానీ అందుకు భిన్నంగా వైసీపి ఘోరంగా ఓడిపోవడంతో జగన్ ఈవీఎంలని నిందిస్తున్నారు తప్ప తన చిత్ర విచిత్రమైన ఆలోచనలు, ధోరణి, అహంభావం వలననే వైసీపి ఓడిపోయిందని నేటికీ అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. ఆత్మపరిశీలన చేసుకొని తప్పులు సరిదిద్దుకోని నాయకుడు కలిగి ఉండటం వైసీపి దౌర్భాగ్యమే కదా?




