వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేవలం తనకు మాత్రమే రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమాభిమానాలున్నట్లు, తాను మాత్రమే నిబద్దతతో సంక్షేమ పధకాలను అమలు చేశానని గట్టిగా నమ్ముతుంటారు. నమ్మకం వరకే అయితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఆ నమ్మకంతో ఎదుటవారిపై బురద జల్లాలని ప్రయత్నిస్తే ప్రమాదం.
ఆస్తుల కోసం సొంత చెల్లి, తల్లిని కోర్టుకీడ్చిన జగన్, ‘తల్లికి వందనం’ పధకంపై సొంత మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తూ అడ్డంగా బుక్ అయిపోయారు.
వైసీపీ సోషల్ మీడియాలో, “తల్లికి వందనం డబ్బుల్లో నుంచి రూ.2,000 చొప్పున లాగేసుకుంటున్న సైకో @naralokesh. రూ.15,000 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ.. ఇప్పుడు రూ.13,000 ఇస్తారట. మిగిలిన డబ్బు నారా లోకేష్ జేబుల్లోకి..! ఇసుక, మద్యంలో దోచుకున్న డబ్బు సరిపోలేదా నారా లోకేష్.. తల్లులకి ఇచ్చే డబ్బులో కూడా ఈ కక్కుర్తి ఎందుకు,” అంటూ ఓ పోస్ట్ పెట్టారు.
‘తల్లికి వందనం’ పధకంతో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు మంచి పేరు వస్తుంది. ప్రజలలో వారికి ఆదరణ పెరుగుతుంది. కనుక వారి ప్రతిష్టని దెబ్బ తీస్తూ, ఈ పధకంలో ఏదో భారీగా అవినీతి జరిగిపోతోందని జగన్ దుష్ప్రచారం చేయాలనుకున్నట్లు అర్దమవుతూనే ఉంది.
కేవలం తాను మాత్రమే సంక్షేమ పధకాలను అమలుచేయగలనని గుడ్డిగా నమ్ముతూ, ఇంతకాలం ప్రజలను కూడా నమ్మించగలిగారు. కానీ ఇప్పుడు తన కంటే ఇంకా గొప్పగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పధకాలను అమలు చేస్తుండటంతో జగన్ షాక్ అయ్యి ఉండవచ్చు.
ఈ పధకాలతో ప్రజలు క్రమంగా టీడీపీ వైపు మొగ్గు చూపడం మొదలుపెడితే వైసీపీ ఓటు బ్యాంకు తరిగిపోతుంది. అదే జరిగితే రాజకీయంగా నష్టపోతామనే భయాందోళనలతోనే జగన్ ఈవిదంగా దుష్ప్రచారం చేయిస్తున్నారని చెప్పక తప్పదు.
లేకుంటే కూటమి ప్రభుత్వం సంక్షేమ పధకాల ద్వారా తనకంటే చాలా ఎక్కువ సొమ్ము లబ్ధిదారులకు చెల్లిస్తున్నందుకు జగన్ అభినందించాలి కదా?
కానీ ఎప్పటిలాగే జగన్ ఒకటనుకుంటే మరొకటి జరిగింది. మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ,”తల్లికి వందనం పథకంలో 2000 రూపాయలు నా జేబులో పడుతున్నాయి అని ఆరోపిస్తున్న జగన్ రెడ్డికి ఇదే నా సవాల్. నా అకౌంట్లో ఆ డబ్బు పడినట్టు 24 గంటల్లో నిరూపించాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని” జగన్ని హెచ్చరించారు.
కానీ జగన్, వైసీపీ స్పందించలేదు కనుక దుష్ప్రచారం చేస్తూ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు జగన్పై పరువు నష్టం దావా వేసే అవకాశం ఉంది.
ఆరోపణలు చేయడం చాలా సులువు కానీ వాటిని నిరూపించలేరు కదా?కనుక మంత్రి నారా లోకేష్ పరువు నష్టం కేసు వేస్తే జగన్ అడ్డంగా బుక్ అయినట్లే! తాను తీసిన గోతిలో తానే పడటం అంటే ఇదే కదా?




