జగన్ ప్రయాణం – పవన్ ప్రస్థానం..!

Jagan vs Pawan Politics

యువరాజకీయ నేతలుగా, కొత్తతరం ఆలోచనలతో ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో వినూత్న మార్పులు తీసుకువస్తారు అనుకున్న ఈ ఇద్దరు నేతలు, రాజకీయ పార్టీలు స్థాపించి 16 ఏళ్ళ ప్రయాణం ఒకరు, 13 ఏళ్ళ ప్రస్థానం ఒకరు సాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు తమ తమ పార్టీలతో, రాజకీయంతో ఏపీ రాజకీయాలను ఏవిధంగా ప్రభావితం చేసారో ఒక్కసారి చూద్దాం.

ముందుగా వైసీపీ పార్టీ తో జగన్: తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జగన్, తండ్రి ఆకస్మిక మరణంతో వైసీపీ పార్టీ ని ప్రారంభించారు. అయితే ఓదార్పు యాత్రతో మొదలైన జగన్ రాజకీయం ఇప్పుడు రప్ప రప్ప స్థాయికి చేరింది.

ADVERTISEMENT

అయితే వైసీపీ రాకతో ఏపీ రాజకీయాలలో ఊహించని మార్పులెన్నో చోటుచేసుకున్నాయి. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో లేని బూతు రాజకీయాన్ని వైసీపీ తెరమీదకు తెచ్చింది. సోషల్ మీడియాలో మహిళల పై వికృత పోస్టులు పెడుతూ మహిళా రాజకీయ నేతల ఆత్మాభిమానంతో వైసీపీ రాజకీయం చేసింది.

ఇక రాజకీయాలకు సంబంధం లేని మహిళలను రాజకీయ వేదికలెక్కించి వారిని అగౌరవపరించింది. అలాగే చట్ట సభలలో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది. రక్త సంబంధాలు, కుటుంబ సభ్యుల హత్యలు కూడా రాజకీయానికి వాడుకోవచ్చు అని నేటితరం రాజకీయ నాయకులకు పాటలుగా బోధించింది.

ఒక్కఛాన్స్ అవకాశం వస్తే రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చెయ్యొచ్చని, వ్యక్తిగత అహాల కోసం రాష్ట్ర భవిష్యత్ ని సమాధి గా మార్చొచ్చని, అధికారాన్ని ప్రజల ప్రగతి కోసం కాదు ప్రత్యర్థి పార్టీ నేతల రాజకీయ కక్ష్య సాధింపుల కోసమని, ప్రభుత్వం అంటే రాష్ట్ర బాగు కోసం కాదు పార్టీ పురోగతి కోసం అని తెలియచెప్పారు.

ఇక పవన్ విషయానికొస్తే, రాష్ట్ర విభజన గాయాన్ని ప్రశ్నించే గొంతుగా జనసేన అంటూ మొదలైన పవన్ ప్రస్థానం ఎన్నో అవమానాలను మరెన్నో అవహేళనలు ఎదుర్కొని, మూడు పెళ్లిళ్లు అనే వ్యక్తిగత దాడిని భరిస్తూ, ఓటమి అనే భారాన్ని తట్టుకుని గెలుపు అనే గుర్రాన్ని అధిరోహించి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా, 100 % స్ట్రైక్ రేట్ తో గెలిచిన తొలి రాజకీయ పార్టీగా జనసేన పేరు మీద రికార్డు సృష్టించుకున్నారు.

రాష్ట్ర బాగు కోసం తన స్థాయిని, రాష్ట్ర ప్రజల ప్రగతి కోసం తన పార్టీ స్థానాన్ని కూడా తగ్గించుకుని మరి నెగ్గారు పవన్. అనుభవానికే పెద్ద పీట అంటూ బాబు నాయకత్వానికి జై కొట్టారు, ప్రభుత్వం అంటే పగ సాధించడం కాదు పాలన చేయడం అని, అధికారం అంటే అందలం ఎక్కడం కాదు అనుకువగా ఉండడం అని తన విధానాలతో నిరూపించి చూపిస్తున్నారు.

దశాబ్దాలుగా రోడ్డు సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాలకు రోడ్లు, కరెంట్ వసతులు కల్పిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఫ్రెండ్లీ ప్రభుత్వం గా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇక్కడ జగన్ కుటుంబం పై వ్యక్తిగత దాడులుండవు, అలాగే వైసీపీ పార్టీ మాదిరి రప్ప రప్ప రాజకీయాలు ఉండవు, ఇక పరదాల స్థానంలో పలకరింపు కనిపిస్తాయి.

సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ తో జగన్ మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్ ని మూడుముక్కలు చేస్తే, జనసేనతో పవన్ మూడు పార్టీల పొత్తుతో రాష్ట్ర భవిష్యత్ కి బాటలు వేస్తున్నారు. జగన్ సలహాదారులను నమ్మకుంటే, పవన్ పాలననుభవం వైపు నిలబడ్డారు. జగన్ కులాల మధ్య విద్వేషాలతో రాజకీయం చేయాలని చూస్తే పవన్ కులాలను కలుపుతూ రాజకీయం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories