జగనన్నతో విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొని ‘రాజన్న రాజ్యం స్థాపిస్తా’ అంటూ కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్రలు చేసిన వైఎస్ షర్మిల, చివరికి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్దపడ్డారు. ఇందుకోసం నాలుగు నెలలు ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగానని స్వయంగా ఆమే నిన్న నిసిగ్గుగా చెప్పుకొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే తాను కాంగ్రెస్లో విలీనానికి ఒప్పుకొన్నాను తప్ప చేవలేక కాదని చెప్పారు. కానీ విలీనం కుదరకపోవడంతో మళ్ళీ వైఎస్సార్ తెలంగాణ పార్టీని యాక్టివ్ చేసి 119 స్థానాలకు పోటీ చేయబోతున్నామని ప్రకటించారు.
గతంలో ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆమె కూడా తెలంగాణలో తమను నమ్ముకొన్నవారిని రోడ్డున పడేసేందుకు వెనకాడలేదు.
అప్పుడు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ గౌరస్తానని బహిరంగ సభలలో చెప్పిన జగన్, తర్వాత రాష్ట్ర విభజన ఖాయం అని తెలియగానే సమైక్యాంద్రా అంటూ ఏపీకి వచ్చేశారు. అప్పుడు ఆయనను నమ్ముకొని తెలంగాణ ఉద్యమాలకు దూరంగా ఉండిపోయిన కొండా సురేఖ వంటి అనేక మంది నాయకులు రోడ్డున పడ్డారు. వారి రాజకీయ జీవితం నేటికీ ఒడిదుడుకులతోనే సాగుతోంది.
‘మాట తప్పను, మడమ తిప్పను’ అని గొప్పలు చెప్పుకొనే జగన్ తెలంగాణలో వైసీపి నేతలను రోడ్డున పడేసి ఏపీకి వచ్చేస్తే, తర్వాత వైఎస్ షర్మిల వారందరినీ పోగేసి ‘రాజన్న రాజ్యం’ సినిమా చూపించారు.
ఒకవేళ ఆమెను కాంగ్రెస్లో చేరిపోయి ఉంటే, ఆమె శాసనసభ లేదా రాజ్యసభ సీటు సంపాదించుకొని ఉండేవారు. ఆమెను నమ్ముకొని ఇంతకాలం వెంట తిరిగిన వాళ్ళందరూ మళ్ళీ రోడ్డున పడి ఉండేవారు. కానీ కాంగ్రెస్లో చేరలేక తిరిగి వచ్చి మద్యలో ఆపేసిన ‘రాజన్న రాజ్యం’ సినిమాని మళ్ళీ చూపిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశ్యంతోనే తాను కాంగ్రెస్లో చేరేందుకు సిద్దపడ్డానని కవరింగ్ ఇచ్చుకొన్నారు. బహుశః కాంగ్రెస్ కూడా అదే భయంతో ఆమెను పార్టీలో చేర్చుకొనేందుకు సిద్దపడి ఉండవచ్చు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పడంతో తనకు కాంగ్రెస్ తలుపులు మూసుకుపోయాయనే విషయం ఆమె చెప్పలేదు కానీ అందరికీ తెలుసు.
తాను పాలేరు, మరో స్థానంలో కూడా పోటీ చేస్తానని, విజయమ్మగారు, తన భర్త అనిల్ కూడా పోటీ చేస్తారని వైఎస్ షర్మిల నిన్న ప్రకటించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలకాలని చెపుతూ వైఎస్ షర్మిల తన కుటుంబంలో అందరికీ టికెట్లు ఇచ్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలే కేసీఆర్ ధాటికి తట్టుకోలేకపోతుంటే తెలంగాణ ప్రజలు వద్దనుకొంటున్న రాజన్న రాజ్యాన్ని వైఎస్ షర్మిల ఎలా స్థాపించాలనుకొన్నారో?



