జనసేన పార్టీ ఆంతర్యం ఏమిటో దేశముదురు వైసీపీ నేతలకి కూడా అంతుపట్టడం లేదు. ఈరోజు జనసేన పార్టీ పేరిట విడుదల చేసిన ఆ లేఖను చూస్తే వైసీపీ నేతలకు మరింత తిక్క పుట్టడం ఖాయం. ఆ లేఖలో తమ అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్రమోడీతో ఏం మాట్లాడారో బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని, అలాగే దాని గురించి మీడియాలో వచ్చేపుకార్లకు, వైసీపీ నేతల వక్ర భాష్యాలకు కూడా సమాధానాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవిదంగా మేలు చేయాలనే కోణంలోనే సమావేశం జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆ తర్వాత పేరాలలో వైసీపీ కబంద హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిపించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, అందుకోసం కలిసి వచ్చే పార్టీలన్నిటితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగుతామని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఏవిదంగా నష్టపోతోందో ప్రజలకు వివరిస్తామని, తమ పార్టీకి కూడా ఒక్క అవకాశం ఇవ్వాలని ఖచ్చితంగా ప్రజలను కోరుతామని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రజలకు వివరించేందుకు క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తామని లేఖలో పేర్కొన్నారు.
క్లుప్తంగా ఇదీ జనసేన లేఖ సారాంశం. ఇక్కడ రెండు పరస్పర విరుద్దమైన అంశాలను లేఖలో పేర్కొనడం వైసీపీ నేతలకు మింగుడు పడటం కష్టమే. జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతామని, పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని ప్రజలకు నచ్చజెపుతామంటోంది. అంటే జనసేన ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయబోతోందని అర్దమవుతోంది. జనసేనతో పొత్తులు ఉంటాయని బిజెపి చెపుతోంది కానీ జనసేన చెప్పడం లేదు. అంటే వాటి మద్య పొత్తులు ఉంటాయో లేవో తెలీదు.
ఒంటరి పోరు అని సంకేతాలు ఇస్తూనే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా రాష్ట్రంలో కలిసివచ్చే పార్టీలతో ముందుకు సాగుతాము.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడతామని చెపుతోంది. అంటే టిడిపి, తదితర పార్టీలతో పొత్తులు ఉండవచ్చని చెపుతున్నట్లుంది. ఇంతకీ టిడిపితో పొత్తులు పెట్టుకొంటుందా లేదా?అనే వైసీపీ నేతల ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఈవిదంగా డొంకతిరుగుడు సమాధానాలు చెపుతుండటం వారు జీర్ణించుకోవడం కష్టమే కానీ ఇదీ ఓ రకమైన వ్యూహమే అనుకోవచ్చు.



