“నీ వైసీపీని అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు” అంటూ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. కట్ చేస్తే… కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి వైసీపీది.
భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పోటీ చేసిన అన్ని 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలలో జనసేన జయకేతనం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విజయం అనూహ్యం, అనన్య సామాన్యం, ఊహలకందనిది. గత ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైన జనసేన ఈ సారి ఏకంగా 21 సీట్లతో అసెంబ్లీలోకి సగర్వంగా అడుగుపెట్టబోతోంది.
కూటమిలో బీజేపీని చేర్చుకుని, మూడు పార్టీలను అనుసంధానం చేసిన ఘనతను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ కు టీడీపీ వర్గాలు కూడా నీరాజనాలు పలికారు. గెలుపు అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన పవన్, వైసీపీ మాదిరి కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడబోమని అన్నారు.
తమ దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి పైనేనని, ఉద్యోగాలు కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ సమస్యను పరిష్కరించడం వంటి సవాళ్లు తమ ముందు ఉందని విజయం అనంతరం జనసేన పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలియజేసారు పవన్ కళ్యాణ్. ఎన్నడూ లేనంత ఆనందంగా పవన్ కళ్యాణ్ ఉండడం పట్ల అభిమానులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంలో సంబరాలు చేసుకుంటున్నారు.





