ప్రస్తుతం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ జమిలి ఎన్నికలు. కేంద్ర ప్రభుత్వం దీనికోసం కమిటీ వేసి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తుండటంతో జమిలి ఎన్నికలు ఖాయమనే వాదనలు దేశమంతా వినిపిస్తున్నాయి. దీని సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే, జమిలి ఎన్నికలు జరిగితే ఎన్నికల ప్రచారంలో జాతీయఅంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. వాటిలో రాష్ట్రస్థాయి అంశాలు మరుగునపడిపోతాయి. కనుక జమిలి ఎన్నికల వలన ప్రాంతీయపార్టీలకు నష్టం, కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీకి లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇందుకే తెలంగాణ సిఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల నుంచి శాసనసభ ఎన్నికలను వేరుచేసుకొనేందుకు 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. కానీ జమిలి ఎన్నికలు జరిగితే కధ మళ్ళీ మొదటికొస్తుంది. బిఆర్ఎస్ నష్టపోతుంది. కనుకనే ఈ ప్రతిపాదనను అప్పుడే బిఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
ఏపీలో గత రెండుసార్లు కూడా శాసనసభ, లోక్సభ ఎన్నికలు కలిసే జరిగాయి. కనుక 2024లో కూడా మళ్ళీ ఒకేసారి జరుగబోతున్నాయి. మొదటిసారి ఏపీ సెంటిమెంట్ వలన టిడిపి, రెండోసారి వైసీపీ ప్రభంజనం వలన వైసీపీ లబ్ధిపొందాయి. కనుక జమిలి ఎన్నికలతో టిడిపి, వైసీపీ, జనసేనలకు కొత్తగా వచ్చే లాభం, నష్టం ఏదీ ఉండకపోవచ్చు. అందుకే విజయసాయి రెడ్డి జమిలి ఎన్నికలను స్వాగతిస్తూ ట్వీట్ చేశారనుకోవచ్చు. తద్వారా కేంద్రానికి వత్తాసు పలికిన్నట్లు ఉంటుంది. పార్లమెంటులో కూడా మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ముందే చెప్పిన్నట్లు భావించవచ్చు.
అదే… జగన్ ప్రభుత్వం ముందస్తు శాసనసభ ఎన్నికలకు వెళ్ళి ఉంటే, రాష్ట్రానికి సంబందించిన అంశాలపైనే ప్రజాభిప్రాయం పొందాల్సి వచ్చేది. అప్పుడు వైసీపీ, టిడిపిలకు విజయమో… వీరస్వర్గమో అన్నట్లు ఉండేది.
జనసేన బిజెపితోనే ఉండి కనుక అది కూడా జమిలి ఎన్నికలకు ఓకే చెప్పేసింది. ఏపీలో 2024లో ఎలాగూ లోక్సభ, శాసనసభ ఎన్నికలు కలిపే జరుగుతాయి కనుక టిడిపి కూడా జమిలికి మద్దతు ప్రకటించవచ్చు.



