“వాళ్ళు కప్పు గెలిస్తే మేము ప్రేక్షకుల హృదయాలు గెలిచాం” అంటూ క్రీడలలో ఎక్కువగా రన్నర్ అప్ గా నిలిచిన జట్టు సభ్యులు అనే మాట, వారి మద్దతుదారులు వినే మాట కూడా ఇదే.
అయితే ఇప్పుడు ఈ మాట రాజకీయాలలో కూడా తరచుగా వినిపిస్తూనే ఉంది, మరి ముఖ్యంగా ఉపఎన్నికలు వంటి అత్యంత ప్రతిష్టాత్మక సమరంలో ఓడిన పార్టీ నేతల నుంచి ఈ వాఖ్యం ఎక్కువగా వినపడుతుంది.
వారు భౌతికంగా గెలిస్తే మేము నైతికంగా గెలిచాం, వారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడితే మేము అధికారం కోసం సక్రమంగా పోరాడం, వారు అధికార దుర్వినియోగానికి ఒడిగడితే మేము ప్రజా స్వామ్యానికి కట్టుబడి తలవంచాం.
ఇలా ఇటువంటి రాజకీయ ప్రవచనాలు, నీతి వ్యాఖ్యలు ఓటమికి అంచున ఉన్న పార్టీల నేతలు ప్రకటనల రూపంలో ప్రజలకు, ఓటర్లకు వల్లెవేస్తుంటారు. అయితే ఇందులో వాస్తవం ఎంత అంటే రాజకీయంలో ‘రాజీ’ అంత అని చెప్పవచ్చు.
అధికారంలో ఉన్న పార్టీలు తమకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకోగలరు, వాటిని అడ్డుకోలేని ప్రతిపక్షాలు ఇలా ఓటర్ల ఓట్ల కాకుండా వారి హృదయాలను గెలుచుకున్నాం అంటూ తృప్తి పడుతుంటారు.
అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోరులో కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ ల పార్టీల మధ్య నెలకొంది. అయితే ఇందులో ప్రతిపక్ష బిఆర్ఎస్ కాంగ్రెస్ నైతికంగా ఓడిపోయింది, తన అధికారంతో వ్యవస్థను తన హస్తగతం చేసుకుంది, అయినా మేము ప్రజల హృదయాలు గెలిచాం అంటూ ఓటమిని పరోక్షంగా అంగీకరించేలా ప్రకటనలు చేస్తుంది.
అయితే ఉపఎన్నికలు అంటే మాగ్జిమమ్ అది అధికార పార్టీకే అనుకులంగా ఉండడం సర్వ సహజం. ఇందులో కచ్చితంగా ఒకరు ఓటర్ల ఓట్లు గెలిస్తే మరొకరు వారి హృదయాలు గెలవల్ససిందే..!






