‘క్రైస్తవం’ పేరుతో ప్రజలను ఎవరో తప్పుదోవ పట్టిస్తే వారి గురించి తానెందుకు స్పందించాలని క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ ప్రశ్నించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… బైబిల్ లో ఉన్నది ఉన్నట్టు చెప్పడం తన పని అని, బైబిల్ సారాంశం అందరికీ చేరాలని.. త్యాగం, అహింస, జీవన విధానం గురించి క్రీస్తు చెప్పిన సందేశాన్ని వివరిస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా ‘కొంత మంది క్రైస్తవ మతబోధకులు ప్రార్థనలతో రోగాలు నయం చేస్తారట, వర్షాలు కురిపిస్తారట, బ్రదర్ అనిల్ అయితే వర్షం కురిపిస్తానంటున్నారు… ఇవన్నీ వాస్తవమా?’ అని యాంకర్ ప్రశ్నించగా… కేఏ పాల్ సమాధానమిస్తూ, దానికి తానెలా సమాధానం చెప్పగలనని అన్నారు. ఎవరూ చేస్తానన్నారో వారినే అడగాలని సూచించారు.
దీంతో యాంకర్ మళ్లీ కల్పించుకుని అంటే ‘వాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని మీరు చెబుతున్నారా?’ అని మళ్లీ ప్రశ్న సంధించగా… కేఏ పాల్ సమాధానమిస్తూ, ఎవరో ఏదో చేస్తే దానికి తీర్పు చెప్పేందుకు తానెవరినని అన్నారు. తానేం చేస్తానో, తానేం చేయగలనో అదే ప్రజలకు చెబుతానని, వేరెవరి గురించో తాను చెప్పలేనని అన్నారు. ఈ మాటల విన్న జనాలు మాత్రం, చాలా కాలం తర్వాత పాల్ కాస్త సమయస్పూర్తితో మాట్లాడారని అంటున్నారు.



