సిఎం రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కాళేశ్వరం కమీషన్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవోని రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దాని ఏర్పాటుని హైకోర్టు తప్పు పట్టలేదు. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వనందుకు కేసీఆర్, హరీష్ రావుకి ఊరట లభించింది.
సీబీఐ విచారణ జరపరాదని కూడా చెప్పలేదు. కనుక దీనిపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ మళ్ళీ ప్రభుత్వం లేఖ వ్రాస్తుంది. మేము ఇప్పటికే రెండు లేఖలు వ్రాశాము. కానీ కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు. సీబీఐ విచారణ జరిగితే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి అంతా బయటపడుతుంది. ఆ భయంతోనే బీఆర్ఎస్ పార్టీ ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. బిజేపి- బీఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉన్నందునే కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించడం లేదు.
కానీ సీబీఐ విచారణ జరిపించకపోతే మేము ప్రభుత్వం తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, ఆ మాట అన్నందుకే నన్ను పార్టీలో నుంచి బయటకు గెంటేశారని ఆయన కూతురు కల్వకుంట్ల కవితే చెప్తున్నారు కదా?” అని ప్రశ్నించారు.
బిజేపి-బీఆర్ఎస్ పార్టీల మద్య ఫెవికాల్ బంధం ఉందని సిఎం రేవంత్ రెడ్డే చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరుపకుండా, కేసీఆర్, హరీష్ రావులని అరెస్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వమే అడ్డుపడుతోందని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపిస్తున్నారు. మరి అటువంటప్పుడు సీబీఐ విచారణ జరిపించాలని మళ్ళీ మళ్ళీ కోరడం వలన ఏం ప్రయోజనం? అంటే కనీసం ఈవిధంగానైన ఆ రెండు పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టవచ్చనే ఆలోచనతో కావచ్చు.







