తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మున్సిపల్ ఎన్నికలలో ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ జెండాతో మున్సిపల్ ఎన్నికలలో 10 మంది జాగృతి అభ్యర్ధులు పోటీ చేశారు. వారిలో 8 మంది గెలిచారు. దీంతో మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ జాగృతి తొలి విజయం సాధించినట్లయింది.
కానీ ఆమె సంబరం జరుపుకునేలోగానే గెలిచిన అభ్యర్ధులకు ప్రతినిధిగా వడ్డేపల్లి శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి, “మాకు తెలంగాణ జాగృతితో ఎటువంటి సంబంధమూ లేదు. మేమందరం ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలో ఉన్నాము. మా పార్టీ తరపునే పోటీ చేసి గెలిచాము,” అని స్పష్టం చేశారు.
“ఇటీవల మీరు తెలంగాణ జాగృతిలో చేరారు కదా?” అని ఓ విలేఖరి ప్రశ్నించగా గతంలో నేను టీడీపితో సహా కొన్ని పార్టీలు మారిన మాట వాస్తవం. కానీ తెలంగాణ జాగృతి ఎన్నడూ చేరలేదు. ఎందుకంటే అది రాజకీయ పార్టీ కాదు కనుక,” అని సమాధానం చెప్పారు.
ఎన్నికలలో ఓ పార్టీ తరపున పోటీ చేసినవారే గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నప్పుడు, అసలు పార్టీయే లేనప్పుడు ఆమెకు ఎందుకు కట్టుబడి ఉంటారు? అని ఆలోచించి ఉండి ఉంటే ఆమె ఇటువంటి ప్రయత్నం చేసేవారు కారు.ఏది ఏమైనప్పటికీ కల్వకుంట్ల కవితకు ఇదొక కొత్త గుణపాఠమే!




