‘తెలంగాణ రాష్ట్ర సేన’ (తెరాస, టీఆర్ఎస్) పార్టీ పేరు, జెండా ప్రకటించిన తర్వాత కల్వకుంట్ల కవిత తన అజెండా గురించి వివరిస్తూ, “తెలంగాణ ఉద్యమ కుటుంబంలో ఉన్నందుకు గర్వపడుతున్నా. అదే సమయంలో నిరంకుశ పాలన చేసిన పార్టీలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా.
నాడు కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నానా అరాచకాలకు పాల్పడుతున్నప్పుడు నేను కూడా ఆ పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నందుకు దాని తప్పులు, పాపాలలో భాగస్వామినయ్యాను కనుక ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు చెపుతున్నా,” అంటూ తండ్రి పాలన తెలంగాణకు స్వర్ణ యుగం కాదని కూతురు కవిత ఒక్క ముక్కలో తేల్చేశారు.
నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్కి, ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఫామ్హౌసులో సేద తీరుతున్న ఇప్పటి కేసీఆర్కి చాలా తేడా ఉంది. కేసీఆర్ కేవలం మర మనిషిగా, గుంట నక్కలు, తోడేళ్ళ చేతుల్లో బందీగా మిగిలిపోయారు,” అని కల్వకుంట్ల కవిత తండ్రిని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వదులుకొని ఆత్మ కోల్పోయి జీవచ్చవంలా మారింది. కనుక ఆ తెలంగాణ ఆత్మని తాను అందిపుచ్చుకొని టీఆర్ఎస్ పార్టీతో ప్రజల ముందుకు వచ్చానన్నారు.
తాను మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తల్లిగా పరిణతి చెందాలని, అప్పుడే బిడ్డల కష్టాలు తెలిసిన తల్లిగా ప్రజారంజకమైన పాలన సాగించగలనన్నారు.
కనుక తెలంగాణకు బీఆర్ఎస్ తల్లి, కాంగ్రెస్ తల్లి కాకుండా ఇప్పుడు కల్వకుంట్ల కవిత రూపంలో మరో తల్లి లభించిందన్న మాట!
కల్వకుంట్ల కవిత ప్రసంగంలో పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ కాకుండా రెండు ప్రధాన అంశాలు: తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ ఇక పనికి రాదు. ముఖ్యమంత్రి పదవి చేపడతాను.
నేను అమ్మగా పరిణతి చెందాలి అనుకుంటున్నా, బిడ్డలకు ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతది, రాష్ట్ర ప్రజల కష్టాలు తీరుతాయి. – కల్వకుంట్ల కవిత గారు pic.twitter.com/yINHZSWYlX
— Telangana Jagruthi (@TJagruthi) April 25, 2026




